రైతులకు సంకెళ్లు, ధర్నాచౌక్ ఘర్షణ: కెసిఆర్కు సెగ, పోలీసులపై ఫైర్
ఖమ్మం రైతులకు పోలీసులు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన సంఘటనపై, హైదరాబాద్ ధర్నా చౌక్ సంఘటనపై కెసిఆర్ పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా రైతులకు సంకెళ్లు వేయడంపై, హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద చెలరేగిన ఘర్షణపై కెసిఆర్ ప్రభుత్వం మీద తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
ఆ రెండు సంఘటనలపై కెసిఆర్ పోలీసు ఉన్నతాధికారులపై మండిపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సంఘటనల్లోనూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆయన పోలీసు ఉన్నతాధికారులతో అన్నట్లు చెబుతున్నారు.
కెసిఆర్ తనను కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆ రెండు సంఘటనలపై తన భావనలను వారితో పంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ రెండు సంఘటనల్లో పోలీసు తీరును తాను అంగీకరించలేనని చెప్పినట్లు తెలుస్తోంది.

ఖమ్మం ఘటనపై....
ఖమ్మం మిర్చియార్డులో ఇటీవల విధ్వంసం చెలరేగిన విషయం తెలిసిందే. దాన్ని ప్రతిపక్షాల కుట్రగా తెరాస నాయకులు మాత్రమే కాకుండా తెరాస అధికారిక పత్రిక నమస్తే తెలంగాణ కూడా అభివర్ణించింది. ఈ సంఘటనపై కొంత మంది రైతుల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే, సంకెళ్లు వేసి రైతులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో కెసిఆర్ పోలీసుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ధర్నా చౌక్ ఘటన...
హైదరాబాద్ ధర్నా చౌక్లో హింస ప్రజ్వరిల్లకుండా పోలీసులు వ్యూహరచన చేశారని అంటున్నారు. అయితే, పరిస్థితి వారి చేతులో దాటిపోయిందని, ఆ స్థితిలో పోలీసులు లాఠీచార్జీకి దిగడంతో కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, హింస చెలరేగిన తీరు పట్ల కెసిఆర్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

పార్టీకి మచ్చనే....
ఖమ్మం, హైదరాబాద్ సంఘటనలకు తెరాసకు మచ్చనే తెచ్చిపెట్టాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెరాస నాయకులు కూడా అదే భావిస్తున్నారు. రైతులకు సంకెళ్లు వేసిన సంఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. పోలీసుల తీరుపట్లనే కాకుండా కెసిఆర్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తమైంది. హైదరాబాదు ధర్నా చౌక్ వద్ద పోలీసులు ఉదయం పూట మఫ్టీలో ఆందోళనకారులుగా, సాయంత్రం పూట డ్రెస్లో దర్శనమివ్వడం కూడా బయటపడింది. ఇది కెసిఆర్ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బగానే పరిణమించింది.

ఖమ్మం రైతులపై ఇలా...
ఖమ్మంలో మిర్చియార్డు విధ్వంసంపై మే 11వ తేదీన పోలీసులు రైతులను అరెస్టు చేశారు. చేతులకు సంకెళ్లు వేసి ఎస్కార్టు పోలీసులతో కోర్టుకు తరలించారు. ఇది తీవ్రమైన నిరసనకు దారి తీసింది. దీంతో ప్రభుత్వం వెంటనే ఇద్దరు సాయుధ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేసింది. ఓ సీనియర్ పోలీసు అధికారి చేత సంఘటనపై విచారణకు ఆదేశించింది.

పోచారం శ్రీనివాస రెడ్డి కూడా...
రైతులకు పోలీసులు సంకెళ్లు వేయడాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి కూడా ఖండించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సి) కూడా స్పందించి సంఘఠనపై నివేదికను సమర్పించాల్సిందిగా ఖమ్మం ఎస్పీని ఆదేశించింది.

పది మందిపై కేసులు....
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఏప్రిల్ 28వ తేదీన ఆందోళనకు దిగారు. మిర్చికి గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. అయితే, అది హింసాత్మక రూపం తీసుకుంది. దాంతో పోలీసులు పది మంది రైతులపై కేసులు పెట్టారు. ఆ తర్వాత రైతుల చేతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తరలించడం వివాదంగా మారింది.












Click it and Unblock the Notifications