కామారెడ్డిలో దారుణం.. కన్నతండ్రిని కిరాతకంగా హత్య చేసిన కొడుకు..
కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్నతండ్రినే కిరాతకంగా హత్య చేశాడో తనయుడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు హత్య జరిగిన తీరు చూసి షాక్ తిన్నారు. సంఘటనా స్థలమంతా రక్తసిక్తంగా మారింది.
వివరాల్లోకి వెళ్లతే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన తాటి ఎల్లయ్య(58) గురువారం(మే 14)న భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కొడుకు ప్రశాంత్ ఎదుటే ఆమెను దూషించాడు. తల్లిపై తండ్రి చేసిన వ్యాఖ్యలు ప్రశాంత్కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న గొడ్డలితో అతనిపై దాడి చేశాడు.
తలపై బలంగా దాడి చేయడంతో ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ప్రశాంత్ బిక్కనూర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే హత్యకు దారితీశాయని ప్రాథమికంగా నిర్దారించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.