కన్నకూతుర్ని గొడ్డలితో నరికి చంపిన కసాయి తండ్రి; ఆగ్రహంతో గ్రామస్తులు; ఉద్రిక్తత!!
సమాజంలో మానవత్వం రోజురోజుకీ కనుమరుగైపోతుంది. రక్త సంబంధాలకు, అనుబంధాలకు అర్థం లేకుండా పోతుంది. రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అన్నది మరచిపోయి కన్న కూతురునే గొడ్డలితో అత్యంత దారుణంగా హతమార్చిన తండ్రి ఉదంతం తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఒక్క సారిగా ఉలికిపాటుకు గురిచేసింది.
కరీంనగర్ జిల్లా మంథని మండలంలోని భట్టుపల్లి లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 11 సంవత్సరాల కూతుర్ని కన్న తండ్రి అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. భట్టుపల్లి గ్రామంలో నివాసముండే సదానందం అతని కుమార్తె 11 సంవత్సరాల వయసున్న రజితను అత్యంత దారుణంగా హతమార్చాడు.

కుమార్తెను చంపిన తర్వాత సదానందం అదే గ్రామంలోని మరో వ్యక్తి శ్రీనివాస్ పై కూడా దాడికి పాల్పడ్డాడు. ఇక ఈ విషయం తెలిసిన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సదానందం ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా గ్రామస్తులు ముళ్ళ కంపలు అడ్డువేసి పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని, తామే అతనికి సరైన శిక్ష వేస్తామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తోపులాట జరగగా గ్రామస్తులు పోలీసుల కళ్లలో కారం కొట్టి పోలీసుల వాహనంపై దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అయితే సదానందం గతంలో తన భార్యను ఉరివేసి చంపిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. ఇప్పుడు కూతుర్ని హతమార్చి, మరో వ్యక్తి పై దారుణంగా దాడికి పాల్పడడంతో గ్రామస్తులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
మరి పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు సదానందం ను ఏం చేశారు? పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి నిందితుడి తీసుకుని వెళ్లారా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే సదానందం సైకోలా మారి ఈ దారుణాలకు పాల్పడినట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications