మనసెలా ఒప్పిందో: కన్నకూతురిని చంపేసి బావిలో పడేశాడు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలంలోని కుశ్నపల్లిలో కన్నతండ్రి అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టాడు. శ్రీరాంపూర్ క్రిష్ణకాలనీకి చెందిన సల్ల తిరుపతిరెడ్డి తన మూడేళ్ల కూతురు మీనాక్షిని గొంతునులిమి హతమార్చి బావిలో పడేశాడు.
అదనపు కట్నం తేవడం లేదని కోపంతో తన భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడని అతడి భార్య రమ గురువారం నెన్నెల పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. కుశ్నపల్లికి చెందిన రమ్యకు తిరుపతిరెడ్డితో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. 20లక్షల రూపా యలు, కుశ్నపల్లి శివారులో మూడెకరాల పొలం, 15 తులాల బంగారం తిరుపతికి కట్నంగా ఇచ్చా రు.
పాప పుట్టిన తర్వాత అదనపు కట్నం తేవా లని తన భర్తతోపాటు అత్తారింటివారు వేధించేవారని రమ చెప్పింది. కట్నం కోసం తన భర్త విచక్షణ రహితంగా కొట్టేవాడని చెప్పింది. గతంలో ఓసారి తనతోపాటు కూతురిపై హత్యాయత్నం చేశాడని తెలిపింది. గొడవల కారణంగా కొన్నాళ్లు దంపతులు వేర్వేరుగా ఉన్నారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు జరిగాయి. కలిసి ఉంటామని చెప్పి మూడు నెలల క్రితం భార్య రమ, కూతురు మీనాక్షిని తీసుకెళ్లాడు.
తిరుపతిరెడ్డి వృత్తిరీత్యా చెన్నూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కొద్ది రోజులుగా భార్య, పిల్లలతో అక్కడే ఉంటున్నాడు. తిరుపతిరెడ్డి, రమ్యల తల్లిదండ్రులకు కుశ్నపల్లిలో ఆస్తులు, వ్యవసాయ భూములు ఉన్నాయి. మంగళవారం తిరుపతిరెడ్డి పొలం పనులకు బైక్పై పాపతోపాటు కుశ్నపల్లికి వచ్చాడు.
కానీ తిరిగి వెళ్లేటప్పుడు పాప కనిపించకపోవడంతో బంధువుల ఇంటిలో వదిలి వెళుతున్నట్లు భావించారు. బుధవారం సాయంత్రం బావిలో మీనాక్షి మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.
తిరుపతిరెడ్డి గ్రామంలో సాయంత్రం వరకు ఉం డి, కూతురిని గొంతునులిమి బావిలో పడేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి, రూరల్సీఐ కరీముల్లాఖాన్, తాళ్లగురిజాల ఎస్సై అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.