నిజామాబాద్ జిల్లాలో 13ఏళ్ళ కూతురిపై తండ్రి అత్యాచారం; కృష్ణా జిల్లాలో ఏడేళ్ళ బాలికపై దారుణం
దేశంలో ఎక్కడ చూసినా బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. మానవ సంబంధాలను, అనుబంధాలను మరచి కాపాడాల్సిన కన్నతండ్రులే కామపిశాచుల్లా మారి బిడ్డల జీవితాన్ని ఛిద్రం చేస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఏపీలో పలు జిల్లాలలో తండ్రులు తమ బిడ్డల జీవితాలను చిద్రం చేసిన సంఘటనలు మరచిపోక ముందే, తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణం.. కన్నబిడ్డపై తండ్రి అకృత్యం
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లో ఓ గ్రామంలో జరిగిన దారుణంలో కన్నకూతురిపై తండ్రి మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 23వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో కన్నతండ్రి పదమూడేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా కుమార్తె లోలోపల బాధపడుతోంది. తండ్రి చేసిన పనికి దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళింది బాలిక.

బాలికను ప్రశ్నించిన తల్లి, కూతురు చెప్పింది విని తల్లి షాక్.. పోలీస్ కేసు నమోదు
కొద్దిరోజులుగా కుమార్తె ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి కుమార్తెను గట్టిగా ప్రశ్నించింది. దీంతో కుమార్తె తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని తల్లితో చెప్పింది. వెంటనే తల్లి కుమార్తె ను ఆసుపత్రికి తరలించి, పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. వావి వరుసలు మరిచి కన్నబిడ్డపై అత్యాచారానికి పాల్పడిన తండ్రిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు.

కృష్ణా జిల్లాలో ఏడేళ్ళ బాలికపై యువకుడు అత్యాచారం
ఇదిలా ఉంటే ఏడు సంవత్సరాల బాలికపై ఒక యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా నున్న ప్రాంతంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఏడు సంవత్సరాల ఓ మైనర్ బాలిక రెండవ తరగతి చదువుతుంది. అదే ప్రాంతానికి చెందిన అనిల్ అనే యువకుడు స్కూల్ కు వెళ్తున్న బాలికను అడ్డగించి మాయమాటలు చెప్పి బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. గురువారం రోజు ఈ సంఘటన చోటు చేసుకోగా బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Recommended Video

నిత్యకృత్యంగా మారుతున్న అత్యాచార ఘటనలు
సమాజంలో నిత్యం ఎక్కడో ఒక చోట ఈ తరహా దారుణాలకు, అఘాయిత్యాలకు పాల్పడడం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఎన్ని చట్టాలు వచ్చినా, ప్రభుత్వాలు, పోలీసులు ఎంతగా అత్యాచారాలను నిరోధించటానికి ప్రయత్నాలు చేస్తున్నా నిత్యం దేశంలో ఇలాంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే చట్టాలు, శిక్షలు మాత్రమే సరిపోవు. మానవుల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. లేదంటే ఎలాంటి విచక్షణ లేకుండా జరుగుతున్న ఇటువంటి దాడులు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications