బాబోయ్.. ఇంత దారుణంగానా? బిర్యానీ ఎలా చేస్తున్నారంటే!..
ఫంగస్ చేరిన మాంసాన్నే బిర్యానీ తయారీకి వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు.
సికింద్రాబాద్: పండగ పబ్బం అన్న తేడా లేకుండా హైదరాబాద్ హోటళ్లన్నీ ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటాయి. ముఖ్యంగా బిర్యానీ హోటల్స్. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న డిమాండ్ రీత్యా.. నగరంలో అడుగుపెట్టే ప్రతీవారు బిర్యానీ టేస్ట్ చేయందే ఇక్కడినుంచి కదలరు.
బిర్యానీ ప్రియులను కలవరపెట్టేలా
అలాంటి బిర్యానీ గురించి ఈమధ్య కాలంలో ఇలాంటి వార్తలు తరుచూ వినాల్సి రావడం.. బిర్యానీ ప్రియులను కలవరపెడుతోంది. మొన్నటికి మొన్న చెన్నైలో కుక్క మాంసం, పిల్లి మాంసంతో తయారుచేసిన బిర్యానీ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్ లో కంటోన్మెంట్ బోర్డ్ సానిటరీ వింగ్ జరిపిన తనిఖీల్లోను పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.
రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసంతో..
దాదాపు 500 లకు పైగా హోటల్స్ లో తనిఖీలు నిర్వహించిన సానిటరీ విభాగం.. 15 హోటల్స్ కస్టమర్ల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి.. రోజుల తరబడి ఫ్రిజ్ లో నిలువ ఉంచిన మాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నట్టుగా తేల్చింది. సదరు హోటల్స్ నిర్వాకాన్ని చూసి అధికారులే కంగు తిన్నారు.
ఫంగస్ చేరిన మాంసంతో బిర్యానీ
ఇక సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి ప్రాంతంలో షాహి బిర్యానీ దర్బార్ అనే రెస్టారెంట్ ది కూడా ఇదే. ఫంగస్ చేరిన మాంసాన్నే బిర్యానీ తయారీకి వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు. చికెన్, మటన్, సీఫుడ్ను ఒకేసారి భారీ మొత్తంలో కొని తద్వారా కొంత మొత్తాన్ని ఆదా చేసుకుంటున్న హోటల్స్.. దాన్ని రోజుల తరబడి నిలవ చేసి.. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.
కిచెన్ లో దుర్వాసన:
అలా రోజుల తరబడి నిలవ చేసిన మాంసానికి ఫంగస్ చేరుతుంది. అధికారుల తనిఖీల్లోను ఇదే విషయం వెల్లడైంది. హోటల్ కిచెన్ లోని ఫ్రిజ్ ఓపెన్ చేయగానే.. దాన్నుంచి దర్వాసన వచ్చినట్టుగా సానిటరీ వింగ్ ఆఫీసర్ ఎమ్. దేవేందర్ తెలిపారు.
డబ్బులు మిగిల్చుకోవడం కోసం:
మారేడ్పల్లిలోని నార్త్ ఇండియన్ రెస్టారెంట్ లోను ఇదే పరిస్థితి దర్శనమిచ్చింది. బల్క్లో మాంసాన్ని కొని.. దాన్ని రోజుల తరబడి నిల్వ ఉంచి బిర్యానీ తయారు చేస్తున్నారు. బల్క్ లో మాంసాన్ని కొనడం ద్వారా ఆదాయం మిగులుతుందన్న ఆలోచనే తప్ప.. కస్టమర్ల ఆరోగ్యం సంగతి వారి చెవికెక్కదు.
జ్యూస్ సెంటర్స్ కూడా అంతే..
మారేడ్పల్లిలోని ఓ జ్యూస్ సెంటర్లో నిర్వాకం కూడా అధికారులను షాక్ కు గురిచేసింది. తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని.. కుళ్లిపోయిన, పాడైపోయిన పళ్లను కొని వాటితో జ్యూస్ తయారు చేసి అమ్ముతున్నారు. తనిఖీల్లో నిర్వాహణ లోపాలున్నట్టు తేలిన 15హోటల్స్ ను అధికారులు సీజ్ చేశారు. 10రోజుల్లో లోపాలను సరిదిద్దుకోకపోతే హోటల్స్ ను శాశ్వతంగా మూసివేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.