కేసీఆర్ అవినీతిపై పోరాటం.!ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యం.!భాగస్వాములు కావాలని ఎన్నారైలకు బీజేపి పిలుపు.!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల్లడిల్లిపోతున్నారని, యువకుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అథో:గతి పాలవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ ఇందుకోసమేనా అన్ని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావు అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతమొందించి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా యుద్దం చేస్తున్నామని, బీజేపీ చేపడుతున్న ఈ మహోద్యమంలో ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మాత్రుభూమి రుణం తీర్చుకోండి.. అమెరికాలోని ప్రవాస భారతీయులకు బండి సంజయ్ పిలుపు
అమెరికాలోని ప్రవాస భారతీయులు ఏక్ దక్కా-తెలంగాణ పక్కా అనే అంశంపై జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన బండి సంజయ్ ఎన్ఆర్ఐలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి పాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రవాసులంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మహోద్యమంలో జైళ్ల పాలై ఇబ్బంది పడుతున్న బీజేపీ కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన ఈ మీటింగ్ లో బండి సంజయ్ ఉద్వేగంగా ప్రసంగించారు.
ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ లక్ష్యం.. బీజేపీ మహోద్యమంలో భాగస్వాములు కావాలన్న సంజయ్
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఎంత మంది యువకులు బలిదానం చేసుకున్నారో, మరెంత మంది తమ జీవితాలను ఫణంగా పెట్టి పోరాడారో అందరికీ తెలుసన్నారు బండి సంజయ్. శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్ వంటి యువకులెందరో తెలంగాణ రావాలి, కష్టాలు తొలిగిపోవాలి, ఉద్యోగాలు రావాలనే ఆశయంతో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. నీళ్లు-నిధులు-నియామకాలు నినాదంతో దశాబ్దాలుగా సాగించిన పోరాటంతో తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్ పార్లమెంట్ వేదికగా గర్జిస్తే, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అందుకు పూర్తి భిన్నంగా పాలన కొనసాగుతుండటం బాధాకరమన్నారు సంజయ్. చంద్రశేఖర్ రావు కుటుంబ, అవినీతి, నియంత్రుత్వ, అరాచక, నయా నిజాం పాలనతో రాష్ట్రం అథో:గతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేసారు బండి సంజయ్.
కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోంది..ఇందుకేనా తెలంగాణ సాధించుకుందన్న బీజేపి ఛీఫ్
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను చంద్రశేఖర్ రావు అప్పుల కుప్పగా మార్చేసాడని బండి సంజయ్ మండిపడడ్డారు. ఏళ్ల తరబడి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగులను నడిరోడ్డుపైకి తెచ్చాడని, వడ్లు కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నడని, 317 జీవో పేరుతో ఉద్యోగుల కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసాడని సంజయ్ వివరించారు. సర్కార్ కు ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా మద్యాన్ని ఏరులై పారిస్తూ తెలంగాణ ప్రజలను మద్యం బానిసలుగా మార్చేసాడని, ఉద్యోగాలివ్వడం చేతగాని చంద్రశేఖర్ రావు, తన కొడుకు, కూతురు, అల్లుడు, సడ్డకుడి కొడుకు, బంధువులకు మాత్రం పదవులిచ్చుకుంటూ జల్సా చేస్తున్నాడని మండిపడ్డారు.
గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని కాపాడాలి.. కదలిరావాలని ఎన్నారైలకు సంజయ్ విజ్ఞప్తి..
మిమ్ముల్ని కన్న తెలంగాణ తల్లి రోదిస్తోందని, గడీల పాలనలో బందీ అయ్యిందని ప్రవాస భారతీయులనుద్దేశించి బండి సంజయ్ పేర్కొన్నారు. చంద్రశేఖర్ రావు పాలనలో అష్టకష్టాల పడుతోందని, చంద్రశేఖర్ రావు చెర నుండి విడిపించండంటూ తెలంగాణ విలపిస్తోందని, తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడానికి, గడీల పాలనను బద్దలు కొట్టడానికి బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం, భారతమాతాకీ జై అంటూ కదం తొక్కుతున్నారని, ఇప్పుడు ప్రవాస భారతీయులుగా తమ ముందు గొప్ప ఆశయం ఉందని, తెలంగాణ తల్లి రుణాన్ని తీర్చుకునే సమయం ఆసన్నమైందని, తెలంగాణ బిడ్డలుగా తాము చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతిచ్చి ప్రజాస్వామిక తెలంగాణ పోరాటంలో భాగస్వాములై మాత్రుభూమి రుణాన్ని తీర్చుకోవాలని ప్రవాస భారతీయులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు.