ఫ్రెషర్స్ డే: తాగి నడిరోడ్డుపై తన్నుకున్న కాలేజీ విద్యార్థులు, పోలీసులనూ..
హైదరాబాద్: ప్రెషర్స్ డే సందర్భంగా రెండు సమూహాలుగా విడిపోయిన విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి కొట్టుకున్న సంఘటన హైదరాబాదులోని చైతన్యపురిలో బుధవారం నాడు చోటు చేసుకుంది. విద్యార్థుల తీరుతో స్థానికులు బెంబేలెత్తారు.
అవంతి కళాశాల చైతన్యపురిలోని ఓ ఫంక్షన్ హాలులో ప్రెషర్స్ పార్టీ నిర్వహించింది. విద్యార్థులు బాగా మద్యం తాగారు. తాగిన మత్తులో విద్యార్థులు గ్రూపులుగా విడిపోయారు. ఒక్కో సమూహంలో పది నుంచి ఇరవై మంది ఉన్నారు. వారు ఒకరి పైన మరొకరు దాడి చేసుకున్నారు.
అసలు విద్యార్థులు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఏం జరిగిందనే విషయం అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు ఒకరి పైన మరొకరు దాడికి దిగారు. కొందరు పారిపోతుంటే మరీ పట్టుకొని కొట్టారు. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అసలు విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి ఎందుకు కొట్టుకున్నారనే చర్చ సాగుతోంది.
విద్యార్థుల కొట్లాట చూసి పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను సైతం వారు లెక్క చేయలేదు. పోలీసులు రంగప్రవేశం చేసిన చాలాసేపటికి వివాదం సద్దుమణగలేదు. కాలేజీ యాజమాన్యం స్పందించవలసి ఉంది.
సెక్స్ వర్కర్ల నుంచి కానిస్టేబుళ్ల వసూళ్లు
రాజేంద్రనగర్ పోలీసులు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. సెక్స్ వర్కర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలతో వారిని అరెస్ట్ చేశారు.
రవీందర్, చారి అనే ఇద్దరు కానిస్టేబుళ్లు డబ్బులు వసూళ్లు చేసినట్లు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు వచ్చింది. సీపీ ఆదేశాలతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో కేసులో గచ్చిబౌలిలో ఓ జంటను వేధించిన కేసులో ఓ కానిస్టేబుల్ను, హోంగార్డు ఆనంద్ను పోలీసులు అరెస్ట్ చేశారు.