ఏపీలో పోరాటం.!తెలంగాణలో ఇరకాటం.!ప్రశ్నించే గొంతుకలకు ఏమైంది.?సంఘాలన్నీ చచ్చుబడ్డాయా.?
హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలైనా, ప్రజా సంఘాలైనా సందర్భోచితంగా స్పందించే గుణం కలిగి ఉంటాయి. డిమాండ్ల కోసం గొంతెత్తుతాయి. హక్కులు సాధించుకుంటాయని ఒకప్పుడు ప్రజల్లో బలమైన నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల పుణ్యమా అని పరిస్థితి మారింది. ప్రభుత్వం ముందు కనీసం పల్లెత్తు మాట అనడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఏలిన వారి కంటపడటం ఎందుకులే అని, ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సంఘాలు పెట్టి, సభ్యుల్ని చేర్చుకుని, అందలం ఎక్కిన లీడర్లు, పాలకులకు దగ్గరై పనులు చక్కబెట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఏ ఉపాధ్యాయుడిని కదిలించినా, ఏ ఉద్యోగిని పలకరించినా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అరిగొసపడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు..హక్కుల కోసం గొంతెత్తని యూనియన్లు
తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది. ప్రభుత్వం అనాలోచితంగా, గందరగోళంగా జారీ చేసిన ఉత్తర్వుతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు గోస పడుతున్నాయి. అయ్యా ఇవీ మా సమస్యలు, ఇవీ మా అభ్యంతరాలు అంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా ఉద్యోగులకు, ప్రభుత్వానికి వారధిగా వ్యవహరించాల్సిన యూనియన్ లీడర్లు, ప్రభుత్వ ప్రతినిధులుగా మారిపోయారు. దాదాపు అన్ని సంఘాల లీడర్లు అలాగే తయారయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలు అండగా నిలబడకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. సర్కారు అడ్డగోలు బదిలీల పేరుతో బలి తీసుకుంటున్నా బాధ్యత మరచిన నేతలు కనీసం గొంతెత్తడం లేదు. ఉద్యోగుల హక్కుల కోసం నిలబడతామంటూ ఏర్పాటైన 54 సంఘాలు ఉన్నాయి. కానీ ఇందులో నిజంగా కొట్లాడుతున్న సంఘాలెన్నో ఇందిరా పార్క్ ఇనుపకంచెలు స్పష్టం చేస్తున్నాయి.
ఏపీలో జంగ్ సైరన్.. తెలంగాణలో జంగ్ సైలెన్స్
కాసేపు ఏపీలో ఏం జరుగుతుందో చర్చిద్దాం. ఏపీలో పీఆర్సీ వల్ల అన్యాయం జరుగుతోందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు. వీరికి ఏ సంఘమో, నాయకుడో నేతృత్వం వహించడం లేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు మూకుమ్మడిగా సర్కారుపై తిరుగుబాటు ప్రకటించారు. 16 సంఘాల నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అందుకే సీఎం జగన్, ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రతిపాదనలకు వంతపాడుతున్నారని కన్నెర్ర చేశారు. సంఘాలు, లీడర్లతో సంబంధం లేకుండా సమ్మెకు వెళ్తున్నట్టు తేల్చిచెప్పారు. ఈ మేరకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితికి కారణం కొంతకాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల భుజాల మీదుగా లీడర్లు అందలం ఎక్కుతున్నారు. ఆ తర్వాత పాలకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ భవిష్యత్ బెర్తులు ఖరారు చేసుకుంటున్నారు. అలాంటి వారిని తృణప్రాయంగా పక్కన పెట్టిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, లీడర్లు లేని ఉద్యమం చేపట్టి, పాలకుల పాకెట్లో కూర్చున్న యూనియన్ లీడర్లకు సరైన గుణపాఠం చెప్పారు.
మనోళ్లకేమైంది.?ఎదురుతిరిగే నైజాన్ని నమిలి మింగేశారా.?
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటం వీరోచితంగా సాగింది. కానీ ఆ వీరత్వం ఏమైంది?ఆ వీరత్వం పిరికితనంగా మారింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమస్యల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నా, వారి తరఫున ప్రశ్నించే దిక్కు లేకుండాపోయింది. ఒక్కో నెలలో, ఒక్కో జిల్లాలో ఒక్కో తేదీన జీతాలు వస్తున్నాయి. కానీ ఎవరికీ పట్టడం లేదు. యూనియన్లు పాలకులకు భజన చేసే సంఘాలుగా మారిపోయాయి. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టుగా ఉద్యోగ సంఘాల నేతల వైఖరితో, హక్కులు సాదించుకోలేక, ఉద్యోగులంతా తలదించుకునే పరిస్థితి నెలకొంది. ప్రమోషన్లు రాకున్నా, బదిలీలు లేకున్నా అడిగే ఉద్యోగ సంఘాల నేతలు కరవయ్యారు. సర్కారు సర్వీస్ రూల్స్ ను ఎవరూ సరిదిద్దే పాపాన పోవడం లేదు. డీఏ రాదు, పీఆర్సీ అమలు కాదు. ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని మాటలు చెబుతూ, పాలకులు వారి నెత్తినే చేయి పెడుతున్నారు.
Recommended Video
ప్రశ్నించే దిక్కేది.? అంతా స్వార్ధమే కనిపిస్తోంది.
సమైక్య రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల పోరాట పటిమను చూశాం. ఏ సమస్య వచ్చినా హక్కుల సాధన కోసం ఆందోళన బాట పట్టేవారు. తెలంగాణ ఉద్యోగులైతే సకల జనుల సమ్మెతో యావత్ దేశం దృష్టిని ఆకట్టుకున్నారు. కానీ ప్రస్తుతం వీళ్లకేమైంది.? అని సందేహించాల్సిన పరిస్థితి నెలకొంది. స్వప్రయోజనాల కోసమో, నామినేటెడ్ పదవుల కోసమో వెంపర్లాడుతూ ఉద్యోగ సంఘాల నేతలు పాలకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఉద్యోగుల ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారు. ఉద్యమ ఆకాంక్షల్ని అటకెక్కిస్తున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తామని చెప్పింది. కానీ క్రమబద్దీకరణ సంగతి పక్కన పెడితే ఉన్నవాళ్లను తొలగిస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మెడికల్ సిబ్బందిని రోడ్డున పడేసింది. కానీ వాళ్ల తరఫున గొంతెత్తే నాథులు కరువయ్యారు. ఇది ఉద్యోగుల సంక్షేమానికి అంతమా.?ఆరంభమా.?కాలమే నిర్ణయించాలి.