వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులనూ భర్తీ చేయండి.!టీ సర్కార్ కు వైయస్ షర్మిళ సూచన.!
హైదరాబాద్ : రాష్ర్టంలో కరోనా వ్యాక్సినేషన్ తిరిగి కొనసాగేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కి వైఎస్.షర్మిల ముఖ్య అనుచరురాలు ఇందిరాశోభన్ లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ తో పాటు బ్లాక్ ఫంగస్ నానాటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. ఇలాంటి నేపథ్యంలో, తెలంగాణలో వ్యాక్సినేషన్ నిలిపివేసి వారం రోజులు అయ్యిందని ఆమె గుర్తుచేశారు. ముఖ్యంగా మొదటి డోసు టీకా వేయించుకుని, రెండో డోసు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని, వారందరికీ తక్షణమే టీకా వేసేలా రాష్ర్ట ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఇందిరాశోభన్ కోరారు. అలాగే, కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చే విధంగా చొరవ చూపాలని ఇంతకు ముందు రాసిన లేఖలో కోరినట్లు ఇందిరాశోభన్ గుర్తు చేశారు.
Recommended Video
అటు అన్ని ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ తో పాటు అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు ఇందిరాశోభన్. పీఆర్సీ నివేదిక ప్రకారం వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 23,724 పోస్టులను తక్షణ భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యేలా చొరవ చూపాలని గవర్నర్ కు రాసిన లేఖలో ఇందిరా శోభన్ విజ్ఞప్తి చేసారు. అంతేకాకుండా స్టాఫ్ నర్సుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ ఇంటర్వ్యూలో ఉద్యోగ అర్హత సాధించినప్పటికీ 658 మందికి పోస్టింగ్ ఇవ్వకుండా బోర్డ్ నాన్చుడుధోరణి అవలంభిస్తోందని ఇందిరాశోభన్ మండిపడ్డారు. వారందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకునేలా కార్యాచరణ రూపొందించాలని ఇందిరాశోభన్ సూచించారు. కొత్తగా కొలువు దీరిన టీఎస్పీఎస్సీ పారదర్శకతతో ఉద్యోగాల భర్తి కొనసాగించాలని, జాప్యం చేస్తే ఉద్యోగాల కనీస వయోపరిమితి చాలా మంది నిరుద్యోగులకు దాటిపోయే ప్రమాదం ఉందని ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేసారు.