పవన్ కళ్యాణ్ 'పాలిటిక్స్'పై మహేష్ కత్తి తీవ్రంగా, మేం రంగంలోకి దిగితే.. మెగా ఫ్యాన్స్ వార్నింగ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వద్ద డబ్బులు లేవని చెబుతున్నారని, మరి పబ్లిక్ ఫంక్షన్లలో ఖర్చు పెట్టడానికి డబ్బు ఎలా వస్తుందని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ అన్నారు.
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వద్ద డబ్బులు లేవని చెబుతున్నారని, మరి పబ్లిక్ ఫంక్షన్లలో ఖర్చు పెట్టడానికి డబ్బు ఎలా వస్తుందని సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ అన్నారు.

అందుకే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదు
పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ నడిపించడానికి డబ్బులు ఎవరు ఇచ్చారని కత్తి ప్రశ్నించారు. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా? అని నిలదీశారు. తన సేఫ్టీ తనకు ముఖ్యం కాబట్టి సమాజంలో జరుగుతున్న పలు విషయాలను పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని, ఖండించడం లేదన్నారు. తనకు రాజకీయాలపై అవగాహన ఉందని చెప్పారు.

పవన్ కళ్యాణ్ ఏం సేవ చేశాడు
పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడంపై కత్తి మహేష్ పైన పవర్ స్టార్ అభిమానులు మండిపడ్డారు. దీనిపై మాట్లాడుతూ.. తనతో ఎవరో ఇలా మాట్లాడిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారని కత్తి మహేష్ వాపోయారు. తాను కూడా అటువంటి ప్రశ్నలు వేయగలనని చెప్పారు. సేవలు చేయడం కోసం పార్టీ పెట్టానని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏం సేవ చేశారని ప్రశ్నించారు.

పవనిజం ఉద్యమమా? ఉన్మాదమా?
పవన్ కళ్యాణ్ రాసిన ఇజం పుస్తకాన్ని తాను ఎంతో కష్టపడి సంపాదించి, పూర్తిగా చదివానని మహేశ్ కత్తి అన్నారు. అందులో పవన్ రాసిన విషయాలు ఓ ఐదవ తరగతి విద్యార్థి కూడా రాయగలడని విమర్శించారు. తాను ఇజం పుస్తకాన్ని చదివినప్పటి నుంచి తనకు పవన్ తీరుపై ఆసక్తి కలిగిందన్నారు. పవన్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్న పవనిజం ఉద్యమమా? ఉన్మాదమా? అనే విషయంపై పరిశోధన చేశానని వ్యాఖ్యానించారు.

చిరంజీవి పైనా
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని అమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరారని కత్తి మహేష్ ఆరోపించారు. కాగా, కత్తి మహేష్ వ్యాఖ్యలపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు దుమ్మెత్తి పోశారు.

మేం రంగంలోకి దిగితే..
చిరంజీవి, పవన్ కళ్యాణ్ల గురించి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, ఇప్పటి వరకు ఊరుకున్నామని, లేదంటే తాము రంగంలోకి దిగాల్సి ఉంటుందని చిరంజీవి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నందకిషోర్ హెచ్చరించారు. మరోసారి మెగా ఫ్యామిలీ జోలికి మేం రంగంలోకి దిగుతామని, అప్పుడు కత్తి మహేష్ గాలికి కొట్టుకుపోతారని హెచ్చరించారు.

నేను భయపడనని కత్తి మహేష్
అయితే తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని కత్తి మహేష్ అన్నాడు. సోషల్ మీడియాలో తనపై పోస్టులు చేస్తూ పవన్ ఫ్యాన్స్ హెచ్చరికలు చేస్తున్నారని, దీనిపై పవన్ తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని కత్తి మహేష్ అన్నారు.

ఎక్కడో ఉండి ఒక ట్వీట్
పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని చెప్పుకుంటూ, ఎక్కడో ఉండి ఒక ట్వీట్ చేస్తున్నాడని కత్తి మహేష్ ఎద్దేవా చేశారు. ట్వీటు చేయడం ఘనకార్యమా అని ప్రశ్నించారు. అభిమానుల తన పట్ల ప్రవర్తించిన విధానానికి పవన్ తనకు క్షమాపణలు చెబుతున్నానని ట్వీట్ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications