రేపు సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి సహా సినీ ప్రముఖుల భేటీ, చర్చకు కీలకాంశాలు
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలైన విషయం విదితమే. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు సినీనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. తాజాగా, ఆయనను పోలీసులు విచారించారు.
ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రముఖ సినీనిర్మాత, టీఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. ఊహించని ఘటన ఓ కుటుంబంలో విషాదాన్ని నింపిందని.. ఆ కుటుంబానికి అందరం అండగా ఉండాలన్నారు. బుధవారం దిల్ రాజుతోపాటు అల్లు అరవింద్, పుష్ప2 సినీమా యూనిట్.. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించారు.

రేవతి భర్తకు సినిమా ఇండస్ట్రీలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని దిల్ రాజు చెప్పారు. తమరోవైపు రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ రూ. కోటి, దర్శకుడు రూ. 50 లక్షలు, నిర్మాతలు రూ. 50 లక్షలు మొత్తంగా రూ. 2 కోట్లు సాయం ప్రకటించారు. ఈ క్రమంలో రేపు (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులతో కలిసి భేటీ కానున్నట్లు దిల్ రాజు వెల్లడించారు.
గురువారం ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో టాలీవుడ్ నుంచి ప్రముఖ సినీనటులు, నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ భేటీకి దిల్ రాజుతోపాటు సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, తదితరులు పాల్గొననున్నారు.
ఇక, ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, తదితరులు పాల్గొననున్నారు. సినీ పరిశ్రమకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం, పన్నుల విధానం, సౌకర్యాల అభివృద్ధి, అలాగే ఇతర సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపైనా చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చలు ప్రభుత్వం, సినీ పరిశ్రమ ప్రముఖుల మధ్య సానుకూలంగా జరిగే అవకాశం ఉంది. పలు సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications