తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం..!!
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
హైదరాబాద్ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దీని నిర్మాణం చేపట్టింది. నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల 17న ఘనంగా సచివాలయ ప్రారంభ వేడుకలకు ప్రభుత్వం మూహూర్తం ఖరారు చేసింది. ఇదే సమయంలో ఆకస్మికంగా సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
భవనాల్లోని తొలి అంతస్థులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. చెక్క పనులు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా మంటలు అంటుకున్నట్లు చెబుతున్నారు. మంటలు చెలరేగటంతో వెంటనే అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఒకే సారి 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు. ప్రమాదం పైన అధికారులు ఆరా తీస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభించారు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం కొనసాగుతోంది. 10, 51,676 చదరపు అడుగుల్లో భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. 265 అడుగుల ఎత్తులో దీనిని నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆరు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం పూర్తిగా డెక్కన్, కాకతీయ శైలిలో నిర్మాణం జరుగుతోంది. భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ఏర్పాటు చేస్తున్నారు.

నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్ పేరు పెట్టాలని గతేడాది సెప్టెంబర్లోనే నిర్ణయించారు. తెలంగాణ సంప్రదాయంతో పాటు ఆధునిక హంగులతో దీన్ని నిర్మించారు. నిర్మాణ తీరును సీఎం కేసీఆర్ స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలించి సూచనలు చేసారు.
ఈ సచివాలయ నిర్మాణానికి జూన్ 27, 2019న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ నెల 17వ తేదీన నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించారు. ఈ ప్రాంభోత్సవానికి తమిళనాడు.. జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరెన్ తో పాటుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడుని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది.
ప్రారంభోత్సవ వేళ సుదర్శన, చండీ హోమాలు చేయనున్నారు. సీఎంఓతో పాటుగా మంత్రులు..అధికారుల కోసం సువిశాల ఛాంబర్లు..ఉద్యోగుల కోసం కార్యాలయాలు ప్రత్యేక ఏర్పాట్లతో సిద్దం అవుతున్నాయి. ఈ నెల 17న ప్రారంభోత్సవం తరువాత అదే రోజున పెరేడ్ గ్రౌండ్స్ లో సభకు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications