Hyderabad: పబ్ వద్ద పోలీసులపైకి కాల్పులు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో ఉన్న కరుడుగట్టిన ఓ పాత నేరస్తుడిని పట్టుకునేందుకు శనివారం రాత్రి పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన నిందితుడు.. వారిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఓ కానిస్టేబుల్, బౌన్సర్కు గాయాలయ్యాయి.
ఈ క్రమంలో చాకచక్యంగా వ్యవరించిన పోలీసులు చివరకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దొంగను పట్టుకున్నారు. నిందితుడి కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్, బౌన్సర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డి తొడలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లినట్లు తెలిసింది. చికిత్స అనంతరం క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

కాగా, ప్రిజం పబ్ వద్ద కాల్పులు జరగడతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర వాతావరణం నెలకొంది. అక్కడున్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుంతో తెలియక పరుగులు తీశారు. చివరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాల్పులు జరిపిన ఆ నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్గా అని తెలిసింది. గత కొంత కాలంగా నిందితుడి కోసం గాలిస్తున్న సీసీఎస్ పోలీసులు.. తాజాగా పబ్లో ఉన్నాడనే సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు.కాగా, బత్తుల ప్రభాకర్పై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో 80పైగా కేసులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్కు ప్రభాకర్ వచ్చాడనే సమాచారంతో పోలీసులు సిబ్బంది వెళ్లారు. పోలీసులను చూసిన ప్రభాకర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మాదాపూర్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట రెడ్డికి గాయాలయ్యాయని ఆయన తెలిపారు.
విశాఖపట్నం జైలు నుంచి నిందితుడు తప్పించుకుని వచ్చినట్లు సమాచారం వచ్చిందని డీసీపీ తెలిపారు. 2023 నుంచి ప్రభాకర్ పరారీలోనే ఉన్నాడని చెప్పారు. నిందితుడి వద్ద నుంచి రెండు తొపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వినీత్ తెలిపారు. గాయపడిన కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
అయితే, వారం రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని అఫ్జల్గంజ్లో ఓ దొంగల ముఠా కాల్పులు జరిపి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రాగా.. దుండగులు కాల్పులు జరిపి అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిందితుల కోసం హైదరాబాద్ పోలీసులతోపాటు కర్ణాటక పోలీసులు కూడా గాలింపు చేపట్టారు. కర్ణాటకలోని ఓ ఏటీఎం వద్ద డబ్బులు పెట్టేందుకు వచ్చిన వాహనంపై కాల్పులు జరిపి డబ్బులు దొంగలించిన తర్వాత.. అక్కడ్నుంచి హైదరాబాద్కు వచ్చింది ఈ దొంగల ముఠా.












Click it and Unblock the Notifications