గాంధీకి ఆలయం: దేవుళ్లకే కాదు... మానవుడైన మహాత్ముడికి కూడా ఆలయం కట్టించారు ఎక్కడో తెలుసా?
హైదరాబాద్ : హిందువులైతే ఆలయాలకు వెళతారు..ఎందుకంటే వారికి ఆలయాలు ఉన్నాయి కాబట్టి... క్రైస్తవులైతే ప్రార్థనలకు చర్చికి వెళతారు..ఇక ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు మసీదుకు వెళతారు. కానీ మీరు జాతిపిత గాంధీని పూజించాలంటే.... ఎక్కడికి వెళ్లాలో తెలుసా...? నల్గొండ జిల్లాలోని పిడకపర్తి అనే ఊరికి. అవును దేశంలోనే తొలిసారిగా జాతిపిత మహాత్మా గాంధీకి ఒక ఆలయం నిర్మించారు. రోజు ఈ గాంధీ ఆలయానికి 100 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక గాంధీ జయంతి సందర్భంగా ఈ ఆలయం కిటకిటలాడుతోంది.
" గాంధీ జయంతి రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ ఆలయానికి తరలి వస్తారు. రోజంతా భజనలు ఉంటాయి. స్కూలు విద్యార్థులకు పలురకాల పోటీలు నిర్వహిస్తాము. ఇందులో గాంధీ మహాత్ముడిపై వ్యాసాలు చర్చలు ఉంటాయి. " అని గాంధీ ఆలయ పాలనాధికారి నరేష్ తెలిపారు.
విరాళాల సేకరణతో గాంధీ ఆలయం పూర్తి
గాంధీ ఆలయం 2014లో నిర్మించారు. నల్గొండ జిల్లాలో దీన్ని నిర్మించారు. మొత్తం నాలుగున్నర ఎకరాల్లో ఈ ఆలయం నిర్మించారు. ఇది హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరుగురు సభ్యులతో కూడిన ట్రస్టు ఈ సందర్శకుల నుంచి వచ్చిన విరాళాలతో మెయింటెయిన్ చేస్తున్నారు. గుడిని మెయింటెయిన్ చేసేందుకు ఈ విరాళాలు సరిపోతున్నాయని, పూజారికి జీతం, రోజువారి పూజలు చేసేందుకు విరాళాలు సరిపోతున్నాయి.
"ఈ రోజు యువతకు మహాత్మాగాంధీకి సంబంధించి పూర్తి విషయపరిజ్ఞానం లేదని మా భావన. అయితే ఆలయానికి ప్రతిరోజు వెళతారు కాబట్టి గాంధీ మహాత్ముడిని గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో గాంధీ ఆలయం నిర్మించాం."అని ట్రస్టు ఛైర్మెన్ శ్రీపాల్ రెడ్డి చెప్పారు.
గాంధీ ఆలయం గురించి క్లుప్తంగా...
ఆలయ నిర్మాణం కోసం ట్రస్టు సభ్యులు విరాళాలు సేకరించారు. దీంతో ఆలయ నిర్మాణం సెప్టెంబర్ 2014లో పూర్తయ్యింది. ఆ తర్వాత క్రమంగా విరాళాలు సేకరించి ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు. రెండంతస్తులు గల ఈ టెంపుల్... రెండో అంతస్తులో ప్రధానాలయం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో మహాత్ముడి విగ్రహం ఉంది. అక్కడ సందర్శకులు కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు. ఆలయంలో లైబ్రరీ కూడా ఉంది. ఇందులో గాంధీ జీవితం ఆయన బోధించిన సూక్తులకు సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. అంతేకాదు భగ్వద్గీత, ఖురాన్, బైబిల్ గ్రంథాలు కూడా ఉన్నాయి.
మహిమలు, అద్భుతాలు చేసే గాంధీ
ఆలయ పూజారి నారాయణచారీ చేసే సుప్రభాతంతో ఉదయం ఆరు గంటలకు ఆలయద్వారాలు తెరుచుకుంటాయి. ఇక్కడ పూజారి 16 రకాల పూజలు నిర్వహిస్తారు. హిందూ ఆలయాల్లో అర్చకులు చేసే పూజలన్నీ ఇక్కడ చేస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు గాంధీ మహాత్ముడు ఎన్నో అద్భుతాలు చేస్తారని విశ్వసిస్తారని పూజారి చెబుతున్నారు. రాజస్థాన్కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తెకు వివాహం జరగడం లేదని అయితే ఈ ఆలయానికి వచ్చి గాంధీ మహాత్ముడిని దర్శించుకున్న కొద్ది రోజులకే తన కూతురుకు వివాహ సంబంధం కుదిరిందని ఆలయ పూజారి నారాయణచారీ తెలిపారు. అంతేకాదు బెంగళూరులో పనిచేసే ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిణి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అవ్వాలంటూ ఎంతో ప్రయత్నించిందని అది కాలేదని చెప్పిన పూజారీ... ఆమె గాంధీ మహాత్ముడిని దర్శించుకున్న తర్వాత బదిలీ వెంటనే జరిగి ఆమెకు విశాఖపట్నంలో పోస్టింగ్ లభించిందని గుర్తు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్టుకు భక్తులు కుంకుమ రంగులో ఉండే రిబ్బన్లు కట్టి తమ కోరికలను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తారని... మహాత్మాగాంధీ వీరి కోరికలను తీరుస్తారని పూజారీ తెలిపారు.