స్నేహితుడి కొడుకుతో పెళ్లి చేయాలని: అమృత, తెరపైకి కొత్త పేర్లు, అతనే రంగంలోకి దిగాడు!
Recommended Video

మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. అమృత వర్షిణిని వదిలివేస్తే రూ.కోటిన్నర ఇస్తానని తండ్రి మారుతీరావు ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనకు పరిచయం ఉన్న రాజకీయ నేతలతో కలిసి కూతురు, అల్లుడిని విడదీయాలనుకున్నాడు. అమృతను శాశ్వతంగా మరిచిపోవాలని, ప్రణయ్ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని సిమ్ నెంబర్లు ఇచ్చి కొత్త నెంబర్లు తీసుకోవాలని మారుతిరావు చెప్పాడట.
ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పని చేస్తున్న ప్రణయ్ తండ్రి బాలస్వామిని మరో బ్రాంచీకి బదలీ చేస్తానని, ఆ బాధ్యత తనదేనని చెప్పాడట. తీవ్ర ఒత్తిడి తేవడంతో ఓ సమయంలో ప్రణయ్ కుటుంబ సభ్యులు అంగీకరించారని అంటున్నారు. సిమ్లను మారుతీరావుకు ఇచ్చేశారని చెబుతున్నారు. ఆ తర్వాత, ప్రణయ్, అమృతలు ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి చేసుకున్నారు.

తండ్రి నుంచి ఒత్తిళ్లు, ప్రణయ్కి నచ్చచెప్పిన అమృత
ప్రణయ్ కుటుంబంపై మారుతీరావు రాజకీయంగా ఒత్తిళ్లు పెట్టడంతో ఓ దశలో మిర్యాలగూడ నుంచి విదేశాలకు కానీ మరో ప్రాంతానికి కానీ వెళ్దామని ప్రణయ్ చెప్పారు. పాస్పోర్టులు కూడా సిద్ధమయ్యాయట. కానీ తన తండ్రి ఉన్నచోటే తాను ఉంటానని అమృత పట్టుబట్టినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి కోపం ఎప్పటికీ ఉండదని నచ్చ చెప్పారట. తన తండ్రిని తాను ఒప్పిస్తానని చెప్పారు. ఆ తర్వాత రిసెప్షన్కు ముందు తీసుకున్న వీడియో ఆల్బమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమయంలో.. దీని కంటే ప్రణయ్ భూమ్మీద లేకుండా చేసే వీడియోకు ఎక్కువ లైకులు వస్తాయని చెప్పినప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నారని చెబుతున్నారు.

అమృత తల్లి ఫోన్లు
అమృత తల్లి కూడా పలుమార్లు ఫోన్ చేసి, నల్లపూసల గొలుసు చేయించానని, కొత్త బట్టల్లో పెట్టి పంపించినట్లు పలుమార్లు ఫోన్ చేశారని ప్రణయ్ తల్లి ఆరోపించారు. హత్యకు పదిహేను రోజుల ముందు అమృత తల్లి ఫోన్ చేశారని, నమ్మించి గొంతు కోశారని ఆరోపించారు.

స్నేహితుడి కొడుకుతో పెళ్లి చేయాలని చూశాడు
తన తండ్రి ఎప్పుడూ స్టేటస్, ప్రిస్టేజ్ గురించే ఆలోచించేవాడని, తన తండ్రి తనపై ప్రేమ చూపలేదని, అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేసేవాడని, తన తండ్రి అతని స్నేహితుడి కొడుకుతో పెళ్లి చేయాలని చివరి వరకు ప్రయత్నాలు చేశాడని, తనపై తన తండ్రి ప్రేమ చూపించలేదని, ప్రణయ్ మాత్రమే ప్రేమ చూపించాడని అమృత అన్నారు. తండ్రిపై కోపం తగ్గదన్నారు. తన తండ్రిని ఒప్పించే శక్తి తన తల్లికి లేదన్నారు. తన తల్లి తన ఆరోగ్యం గురించి నిత్యం జాగ్రత్తలు చెప్పేదన్నారు. ప్రణయ్ పరిచయమైన ఏడేళ్లలో నాలుగేళ్లు తాను హాస్టల్లో ఉన్నానని, తన ఇష్టాయిష్టాలు ప్రణయ్కు బాగా తెలుసునని, నాకు చేతకాకుంటే స్నానం చేయించేవాడని, రాత్రి జోకొట్టేవాడని గుర్తు చేసుకున్నారు.

తెరపైకి కొత్త విషయం
మరోవైపు, ప్రణయ్ హత్య కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసులో కీలక సూత్రధారి అబ్దుల్ బారీ అని పోలీసులు ఇప్పటి వరకు భావించారు. కానీ అతని గురువు అస్గర్ అలీ కూడా రంగంలోకి దిగారని గుర్తించినట్లుగా తెలుస్తోంది. మారుతి రావు నుంచి రూ.1 కోటి తీసుకొని, హత్య చేసిన వ్యక్తికి రూ.10 లక్షలు ఇచ్చాడని తెలుస్తోంది. ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాదంలో పాల్గొన్న వారు ఇలాంటి నేరాలకు పాల్పడటం ఇదే మొదటిసారి.

భారీ ఆశ చూపడంతో అంగీకారం
మీడియాలో వస్తున్న వార్తల మేరకు... కాశ్మీర్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకున్న నల్గొండకు చెందిన అస్గర్ అలీ, అతని శిష్యుడు అబ్దుల్ బారీ ఇండియన్ ముస్లిం మహ్మదీయ ముజాహిదీన్ సంస్థలో కీలక పాత్ర పోషించారు. వీరిపై నమోదైన గుజరాత్ మాజీ మంత్రి హరేన్పాండ్య హత్య కేసును కోర్టు కొట్టివేసిన తర్వాత నుంచి నల్గొండలో ఉంటూ మారుతీరావును కిడ్నాప్ చేశారు. మారుతీ రావు వారితో పరిచయం పెంచుకున్నాడు. ఈ ఈ నేపథ్యంలో వారి సహకారంతో ప్రణయ్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలీకు రూ.1కోటి ఆశ చూపడంతో అతను అంగీకరించాడని తెలుస్తోంది. అబ్దుల్ బారీతో కలిసి అలీ కుట్ర పన్నాడని తెలుస్తోంది. దీని కోసం స్థానిక ముఠాతో పాటు అంతర్రాష్ట్ర ముఠా సహకారం తీసుకున్నాడు. జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితులను గుర్తించాయి. మారుతీరావు, సోదరుడు శ్రవణ్, అస్గర్ అలీ, అబ్దుల్ బారీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మహారాష్ట్ర, చెన్నై, బీహార్లలో మరో నలుగుర్ని పట్టుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

కీలక నిందితుడు షఫీ
ప్రణయ్ హత్య కేసులో కీలక నిందితుడు షఫీ సుపారీ హత్యల్లో నిపుణుడిగా అనుమానిస్తున్నారు. అబ్దుల్ బారీకి ఇతను సన్నిహితుడు. వీరు గత కొంతకాలంగా నల్గొండ, భువనగిరి, మిర్యాలగూడ ప్రాంతాల్లో పలు దందాలు చేస్తున్నారని గుర్తించారని తెలుస్తోంది. కరీం కూడా నిందితులకు సహకారం అందించారని పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications