జవహర్నగర్లో విషాదం: ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు, టీచర్ మృతి
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. జవహర్నగర్ పరిధిలో ఉన్న మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు.
ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మదర్సాలో చదివే విద్యార్థులను టూర్లాగా ఉపాధ్యాయుడు బయటికి తీసుకెళ్లాడు. సరదాగా ఈత కొట్టడానికి ఎర్రగుంట చెరువులోకి విద్యార్థులు దిగారు. చెరువు లోతుగా ఉండటంతో పిల్లలంతా మునిగిపోయారు.
విద్యార్థులను కాపాడేందుకు ఉపాధ్యాయుడు కూడా చెరువులో దిగాడు. విద్యార్థులందరూ ఉపాధ్యాయుడ్ని పట్టుకోవడంతో అతడు కూడా చెరువులోనే మునిగిపోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గత ఈతగాళ్లతో గాలింపు చేపట్టి మృతదేహాలను బయటికి తీశారు.
మృతులు హైదరాబాద్ నగరం కాచిగూడలోని నెహ్రూనగర్ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మల్కాపురంలోని మదర్సాలో ప్రత్యేక శిక్షణా తరగతుల కోసం వచ్చారని చెప్పారు. మృతుల్లో విద్యార్థులు ఇస్మాయిల్, జాఫర్, సోహేల్, అయాన్, రియాన్.. వీరిని కాపాడేందుకు చెరువులో దూకిన వ్యక్తి యోహాన్ గా గుర్తించారు. మృతి చెందిన విద్యార్థులంతా 12-14 ఏళ్ల వయస్సు ఉన్నవారేనని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.