వీడు మనిషి కాదు: చిన్న పిల్లల కిడ్నాప్, పెంచి పెద్ద చేసి వ్యభిచార కూపంలోకి
హైదరాబాద్: అభం శుభం తెలియని చిన్నారులను అపహరించి.. వారిని పెద్ద చేసేందుకు రసాయనిక పదార్థాలు, ఇంజెక్షన్లు ఉపయోగించి.. ఆ తర్వాత వారిని వ్యభిచార కూపంలోకి నెడుతున్న ఓ దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ నయవంచకుడు చేస్తున్న ఘోరాలను తెలిసి పోలీసులు సైతం నివ్వెరపోయారు.
ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చిన్నారిని ఎత్తుకెళ్లిన కేసును ఛేదించిన రైల్వే పోలీసుల దర్యాప్తులో భాగంగా నేర చరిత్ర కలిగిన కాంసాని శంకర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతనితోపాటు మరో ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దుర్మార్గుల బారినుంచి ఇద్దరు ఐదేళ్ల చిన్నారులను కాపాడారు.
విచారణలో ప్రధాన నిందితుడు శంకర్ 20 ఏళ్లుగా సెక్స్ రాకెట్ నడిపిస్తూ.. ఎందరో ఆడపిల్లల జీవితాలను నాశనం చేసినట్లు బహిర్గతమైంది. ఇతనికి రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నట్లు సమాచారం. కాగా, వారం రోజుల కిందట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏపికి ఓ మహిళకు మాయమాటలు చెప్పి దుర్గా(5) అనే బాలికను ఓ మహిళ కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.
కిడ్నాప్ చేసిన మహిళతో మరికొందరు నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ముఠా నాయకుడు శంకర్ను అరెస్ట్తో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన కాంసాని శంకర్(51) 20 ఏళ్లుగా సెక్స్ మాఫియా నడిపిస్తున్నాడు. వ్యభిచారమే కాకుండా ఇతర నేరాలు కూడా చేస్తూ పలుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. వ్యభిచార గృహాలను నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల నుంచి మహిళలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకువస్తాడు. దీనికి దళారులను పెట్టుకొని వారికి కమీషన్ ఇస్తుంటాడు.
2-5ఏళ్లలోపు ఆడ పిల్లలను కిడ్నాప్ చేసేందుకు దళారులను నియమించుకున్నాడు. వారు పట్టణాలతో పాటు గ్రామాల నుంచి చిన్న పిల్లలను ఎత్తుకెళ్తుంటారు. పసిపిల్లలను అపహరించినందుకు రూ. 5 వేల నుంచి 15 వేల వరకు కమీషనర్ ఇస్తుంటాడు శంకర్.
చిన్న పిల్లలను అతడికి సంబంధించిన వ్యభిచార గృహాలకు తరలిస్తూ వారి అలనా పాలన చూసేందుకు కొందరికి బాధ్యతలను అప్పగించి పన్నెడేళ్లు దాటే వరకు పిల్లలను పోషిస్తాడు. ఆ సమయంలో వారికి చిత్రహింసలకు గురిచేస్తారు. అంతేగాక, ఆడపిల్లలు త్వరగా మెచ్యురిటీ అయ్యేందుకు ఇంజక్షన్లను కూడా వాడినట్లు రైల్వే పోలీసులు నిందితుడిని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో తెలిసింది.
అయితే నిందితుడు మాత్రం నోరు విప్పకపోవడంతో ఈ విషయాన్ని నిర్ధారించలేకపోతున్నారు. శంకర్ ఆగడాలపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.
ఇదిలా ఉండగా ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య యాదగిరిగుట్ట ప్రాంతంలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. వ్యభిచారంలోకి వచ్చిన మరో మహిళను శంకర్ తన రెండో భార్యగా చేసుకున్నాడు. ఆడపిల్లలను వ్యభిచారం కూపంలోకి నెట్టడం ద్వారా శంకర్ లక్షల్లో సంపాదించినట్లు సమాచారం.
ఎంతమంది పిల్లలను ఈ ముఠాలు వ్యభిచార రొంపిలోకి దింపాయనే విషయాన్ని ఆరా తీసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసులు వివరాలను తెలుసుకుంటున్నారు. శంకర్ నియమించుకున్న దళారులపైనా పోలీసులు దృష్టి సారించారు.