అందుకే తెలంగాణలో: బన్సాల్, గుండ్లపోచంపల్లిలో ఫ్లిప్కార్ట్ అతిపెద్ద స్టోర్
హైదరాబాద్: ఈ కామర్స్ వ్యాపార దిగ్గజం ఫ్లిప్కార్ట్ తెలంగాణ రాష్ట్రంలో భారీ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను ప్రారంభించింది. మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లి గ్రామంలో ఫ్లిప్కార్ట్ కార్యాలయం శుక్రవారం నాడు లాంచ్ చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఈ బ్రాంచ్ను ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఫ్లిప్కార్ట్ స్టోర్ల సంఖ్య 17కు చేరాయి. మొత్తం 2.2 లక్షల చదరపు అడుగుల వెడల్పులో, 5.89 లక్షల క్యూబిక్ అడుగుల సామర్థ్యంతో బారీ స్థాయిలో దీనిని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకులు బిన్నీ బన్సాల్ మాట్లాడారు. తెలంగాణ ఈ కామర్స్ వ్యాపారం విస్తరింప చేసేందుకు అనువైన ప్రాంతమన్నారు. అందుకే కొత్త శాఖను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించామని చెప్పారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 17వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇక్కడ తమ శాఖను తెరిచేందుకు తాము ఉత్సాహంగా ఉన్నామన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ... దేశంలో ఈ కామర్స్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఫ్లిప్కార్ట్ వంటి సంస్థ తన శాఖను స్థాపించడం సంతోషమన్నారు. ఈ సంస్థను చూసి మరిన్ని తెలంగాణకు వస్తాయని ఆశించారు.