నైటింగేల్ అవార్డు స్వీకరించిన నర్సు నాగమణి(ఫొటో)
న్యూఢిల్లీ: వృత్తిలో విశిష్ట సేవలు అందించినందుకుగానూ సికింద్రాబాద్ చిలకలగూడ రైల్వే దవాఖానాకు చెందిన నర్సు ఉమా నాగేంద్రమణికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2015వ సంవత్సరానికిగాను ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రదానం చేశారు.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన 35 మంది నర్సులకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోసం సంతోషంగా ఉందని ఉమా నాగేంద్రమణి చెప్పారు. రోగులకు సేవలు చేయడంలోతన కృషికి తగిన గుర్తింపురావడం మాత్రమే కాక, ప్రోత్సాహం లభించినందుకు సంతోషం కలిగిందని ఉమా నాగేంద్రమణి తెలిపారు.
తల్లిదండ్రులు, భర్త ప్రోత్సాహంతోపాటు రైల్వే అధికారులు, రైల్వే యూనియన్ నాయకులు మర్రి రాఘవయ్య తదితరుల సహకారం మరువలేనిదని గుర్తుచేసుకొన్నారు.
32 సంవత్సరాల క్రితం నర్సింగ్ వృత్తిలోకి వచ్చానని, ఎంతో మందికి సేవలు అందించిన తృప్తితో పాటు కొన్ని సందర్భాల్లో రైలు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి ఎంత మంచి చికిత్స చేసినా బతికించలేకపోయానన్న బాధ కూడా ఉంటుందని అన్నారు.