ప్రైవేట్ బస్సుల సంక్రాంతి బాదుడుపై దృష్టి.. అడ్డగోలుగా దోచేస్తే కేసులేనట !!
సంక్రాంతి పండుగ సమయంలో తెలుగురాష్ట్రాల్లో బస్సులు, రైళ్ళు కిటకిటలాడుతున్నాయి. సొంత ఊర్లకు ప్రయాణించే వారితో బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక ఇదే సమయంలో విపరీతంగా ధరలు పెంచి ప్రైవేట్ బస్సులు దందాకు తెరతీస్తాయి . పండుగ పది రోజుల ముందు నుండే టికెట్ల ధరను పెంచే ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు అందిన కాడికి దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలాంటి వాళ్లకు చెక్ పెట్టటానికి ప్రత్యేకంగా నజర్ పెట్టింది ఏపీ సర్కార్ .
టికెట్ ధరలు పెంచిన ట్రావెల్స్ పై కొరడా
సంక్రాంతి సమయంలో టికెట్ రేట్స్ ను మరింతగా పెంచేయడం వీలైనంతగా దండుకోవడం రొటీన్ గా ప్రతి సంక్రాంతి సీజన్ లో జరుగుతుంది. ఇక ఈ సారి కూడా సంక్రాంతి సందర్భంగా కూడా విపరీతంగా టికెట్ల ధరలను పెంచి ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకునే పనిలో పడింది . సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనే ప్రయాణికుల నుంచి అయిన కాడికి దోచుకోవడానికి బుకింగ్స్ ఓపెన్ చేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ అధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి సారించారు. బాగా టికెట్ ధరలు పెంచిన ట్రావెల్స్ పై కొరడా ఝుళిపిస్తున్నారు.
170 బస్సుల సీజ్..మరో 80 బస్సుల మీద కేసులు
ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఏపీ వాసులంతా తమ సొంత ఊర్లకు కచ్చితంగా వెళ్తారు . హైదరాబాద్ నుంచి ఏపీకి భారీ ఎత్తున ప్రైవేట్ బస్సులు తిరుగుతాయి. అలాంటి వాటిల్లో కూడా భారీ ఎత్తున టికెట్ ధరలను పెంచేస్తే సహించేది లేదని రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు స్పష్టం చేశారు.అంతే కాదు ఇష్టారాజ్యంగా టికెట్ల ధరలు పెంచిన, నిబంధనలు పాటించని 170 బస్సులను సీజ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. అంతే కాదు మరో 80 బస్సుల మీద కేసులను పెట్టినట్టుగా రవాణా శాఖ ప్రకటించింది.
అధిక ధరలకు టికెట్లను అమ్ముతున్న బస్సులపై 25 వేల జరిమానా
అధిక ధరలకు టికెట్లను అమ్ముతున్న బస్సులపై ఒక్కోదానికి 25 వేల రూపాయల జరిమానాను విధించనునట్టుగా ఏపీ రవాణా శాఖ ప్రకటించింది. అలాగే ట్రావెల్ బస్సుల అక్రమాల నివారణకు కాల్ సెంటర్ నంబర్ ను కూడా ఇచ్చారు అధికారులు .9542800800 నంబర్ కు వాట్సాప్ ద్వారా కంప్లైంట్స్ చేయవచ్చని ప్రకటించారు.ఇప్పటి వరకూ తాము సేకరించిన సమాచారాన్ని వెల్లడించిన రావాణా శాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉక్కుపాదం మోపుతామని చెప్తోంది.