గంటలో అయిపోతుందన్నారు.. చివరకు శవాన్ని అప్పగించారు: ఇంతలోనే మరో షాక్?
మంచిర్యాల: ఆమెకేమి ప్రాణాంతకమైన వ్యాధి లేదు. కొద్దిరోజులుగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. చికిత్స చేయించుకుంటే మంచిదని తెలిసినవారు సలహా ఇస్తే.. ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించింది. కానీ అదే ఆమె ప్రాణం తీస్తుందని ఊహించలేదు. గంటలో ఆపరేషన్ చేస్తామని ఆమెను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లిన వైద్యులు.. చివరకు ఆమె శవాన్ని భర్తకు అప్పగించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ దారుణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలేమైంది?:
వరప్రదాయిని(35) అటవీశాఖలో డిప్యూటీ రేంజ్ అధికారిణిగా పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న ఆమె.. ఇటీవల తనకు తెలిసిన ఓ డాక్టర్ ను సంప్రదించింది. దీంతో
మంచిర్యాలలోని శ్రీ హాస్పిటల్లో చికిత్స చేయించుకోవాలని అతను సలహా ఇచ్చాడు. అతని సూచన మేరకు సోమవారం ఉదయం భర్తతో కలిసి ఆమె ఆసుపత్రికి వెళ్లింది.

అక్కడేం జరిగింది:
ఆసుపత్రిలో ఆమెను పరీక్షించిన వైద్యులు అదే రోజు మధ్యాహ్నం సర్జరీ చేయాలని చెప్పారు. గంటలో ఆపరేషన్ పూర్తయిపోతుందన్నారు. దీంతో భార్యాభర్తలు అందుకు ఒప్పుకోవడంతో.. మధ్యాహ్నం 3.30గం.కు వరప్రదాయినిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఆపరేషన్ కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు ఆశ్లేష, ప్రత్యూషలను పిలిపించారు. వీరిలో అశ్లేష జనరల్ సర్జన్ కాగా.. ప్రత్యూష అనస్థీషియన్.

గంటల తరబడి:
గంటలో ఆపరేషన్ అయిపోతుందని చెప్పిన వైద్యులు.. సాయంత్రం 7గం. దాటినా వరప్రదాయిని చికిత్స గురించి సరిగా స్పందించకపోవడంతో ఆమె భర్తకు అనుమానం కలిగింది. దీంతో పదేపదే వారిని ప్రశ్నించగా.. ఇంకాస్త సమయం పడుతుందంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. రాత్రి 9గం. దాటినా వారి నుంచి ఇదే సమాధానం రావడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్ తన బంధువులకు సమాచారం అందించారు.

చివరకు శవాన్ని అప్పగించారు:
శ్రీనివాస్ బంధువులు, సన్నిహితులు ఆసుపత్రి వద్దకు వచ్చి వైద్యులను నిలదీయగా.. 'మందులు తీసుకురండి.. రక్తం కావాలి.. ఈసీజీ మిషన్ తీసుకురావాలి..' అంటూ చికిత్స చేస్తున్నట్టుగా హడావుడి ప్రారంభించారు. అలా రాత్రి 10గం. దాటిపోయింది. మరోసారి శ్రీనివాస్ అతని బంధువులు వైద్యులను నిలదీయగా.. పరిస్థితి విషమించిందని తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్.. తన భార్యను చూపించాలని ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లగా.. వరప్రదాయిని విగతజీవిగా కనిపించింది. దీంతో బోరున విలపించిన శ్రీనివాస్.. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ వికటించడం వల్లే తన భార్య చనిపోయిందని ఆరోపించారు.

ఇంతలోనే మరో షాక్..:
వరప్రదాయిని కుటుంబం ఆమె మరణవార్తను జీర్ణించుకోలేని విషాదంలో ఉండగానే... ఆ కుటుంబానికి మరో షాక్ తగిలింది. కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి ఆసుపత్రి వద్ద ఉన్న సమయంలో దొంగలు చోరీకి పాల్ప డ్డారు. 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.19 వేల నగదును దోచుకుపోయారు. ఓ పెళ్లి కోసమని తెలిసినవారి దగ్గర వరప్రదాయిని ఆ నగలను తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. ఆమె మృతి చెందిన రోజే ఇంట్లో దొంగలు పడటం వారిని మరింత విషాదంలోకి నెట్టింది.












Click it and Unblock the Notifications