అటవీ సిబ్బంది అత్యుత్సాహం: మహిళలను చెట్టుకు కట్టేసి.. గుడిసెలను తగలబెట్టి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ అధికారులు అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారనే కారణంతో గిరిజన మహిళలను చెట్టుకు కట్టేసి, వారి గుడిసెలు తగులబెట్టారు.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని అటవీ అధికారులు అనాగరిక చర్యలకు పాల్పడ్డ విషయం వెలుగులోకి వచ్చింది. అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారన్న కారణంతో గుడిసెలను తగులబెట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మహిళలను చెట్లకు కట్టేసి గుడిసెలను తగులబెట్టారు.
గోవిందరావుపేట మండలం పస్రా అటవీ రేంజ్ పరిధిలోని జలగలంచ అడవుల్లో చత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అయితే... అటవీ భూముల్లో గుడిసెలు వేసుకున్నారన్న కారణంతో అటవీ సిబ్బంది శనివారం అక్కడకు వెళ్లి గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో తమ గుడిసెలను తొలగించవద్దంటూ గొత్తికోయల మహిళలు అడ్డుకున్నా వినిపించుకోకుండా కొందరు సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. గొత్తికోయల మహిళలను చెట్టుకు కట్టేసి గుడిసెలను తగులబెట్టారు.
అటవీ అధికారులు ఈ తరహా చర్యలకు పాల్పడడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలియగానే సదరు అటవీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.