సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా మాజీ డిప్యూటీ సీఎం షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి నాడు భర్తరఫ్ కాబడిన తాటికొండ రాజయ్య సీఎం కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కడియం శ్రీహరికి సైతం తగిలేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే
కేసీఆర్ ఋణం తీర్చుకోలేనన్న రాజయ్య .. నేను ఏ వ్యాఖ్యలు చెయ్యలేదన్న మాజీ మంత్రి
దళితులకు మూడెకరాల భూమి అంశం తెరపైకి తెచ్చిన రాజయ్య
ఎస్సీ వర్గీకరణ - మాదిగల అభివృద్ధి కోసం మాదిగ సంఘాలు, మాదిగ ప్రజాప్రతినిధులు నిర్వహించిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ వాగ్దానం చేసిన మాట అందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం కేసీఆర్ దళితులు అందరికీ మూడెకరాల భూమి ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని, అర్హులైన దళితులకు మాత్రమే ఇస్తానని చెప్పారని వ్యాఖ్యలు చేశారు.
భూములకు బదులు 30 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలన్న రాజయ్య
ఇక అంతే కాదు ప్రస్తుతం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో దళితులకు ఇవ్వడానికి భూములు ఎక్కడ దొరకడం లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. అంతటితో ఆగక అర్హత కలిగిన ఒక్కో దళిత కుటుంబానికి భూములకు బదులు 30 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ ని కోరుతామని ఆయన సభా ముఖంగా పేర్కొన్నారు. ఇక అంతే కాకుండా ఎస్సీలలో మాదిగలు ఎక్కువగా నష్టపోయారని ఆయన అన్నారు.
మాదిగ ఉపకులాలపై కడియం టార్గెట్ గా వ్యాఖ్యలు
మాదిగ ఉపకులాలకు నిజంగానే అన్యాయం జరిగితే వారు పోరాటం చేయాలని పేర్కొన్నారు తాటికొండ రాజయ్య. మాదిగ ఉపకులాల కి చెందిన కడియం శ్రీహరి పద్దెనిమిదేళ్ల పాటు మంత్రిగా కొనసాగారని గుర్తు చేసిన తాటికొండ రాజయ్య ఉప కులాల్లోని నేతలకు సైతం న్యాయం జరిగిందని మాదిగలకు మాత్రం అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇక ఈ సమావేశంలో మాదిగలకు భూమికి బదులుగా, 30 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ కు పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉన్నాయి.
రాజయ్య వ్యాఖ్యలతో ఇరకాటంలో సీఎం కేసీఆర్
ఇప్పటివరకు భూమి కోసం ఎదురు చూసిన ఎస్సీలు వారికి ఇచ్చేంత భూములు లేకనే జాప్యం జరిగిందని భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ తప్పనిసరిగా భూములు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.కానీ రాజయ్య చెప్పినట్టుగా భూమికి బదులుగా 30 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ మొదలు పెడితే అది సీఎం కేసీఆర్ కు పెద్ద చిక్కు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది.