విషాదం: కరోనా బారినపడి మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత అజ్మీరా చందూలాల్(66) గురువారం రాత్రి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న మూడు రోజుల కిందట హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేటి రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఎన్టీఆర్, కేసీఆర్ ప్రభుత్వాల్లో చందూలాల్ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంత్రిగా పనిచేశారు. సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర మంత్రిగా చందూలాల్ ఎదిగారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో చందూలాల్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.

ములుగు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి మూడుసార్లు, వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. 2005లో చందూలాల్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో తెలంగాణ తొలి మంత్రివర్గంలో పనిచేశారు.
పర్యాటక, సాంస్కృతిక, అటవీ శాఖ మంత్రిగా చందూలాల్ సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీలో పొలిట్బ్యూరో సభ్యుడి స్థాయికి ఆయన ఎదిగారు. 1983 నుంచి 2005 వరకు టీడీపీలోనే ఉన్న ఆయన పలు కీలక పదవులు చేపట్టారు.
ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోనూ పొలిట్బ్యూరోలోనూ చోటు దక్కించుకున్నారు.
అజ్మీరా చందూలాల్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి చందూలాల్ ఎంతో కృషి చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రిగా ప్రజలకు మెరుగైన సేవలందించారన్నారు. చందూలాల్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. చందూలాల్ కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చందూలాల్ మృతి పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చందూలాల్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications