Runa Mafi: రుణ మాఫీ చేయకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం.. హరీశ్ రావు హెచ్చరిక..!
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రైతులకు రుణ మాఫీ హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాతలకు రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో చూస్తే చాలా మందికి రుణ మాఫీ కాలేదని తెలుస్తోంది. చాలా మంది అన్నదాతలు తమకు రుణ మాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు. తమకు రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ, బీఆర్ఎస్ వస్తున్నాయి.
ఇప్పటికే బీఆర్ఎస్ రుణ మాఫీ చేయాలని చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రుణ మాఫీపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దసరాలోపు రుణ మాఫీ చేయాలన్నారు. లేకుంటే రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరులో రుణ మాఫీ చేయాలని రైతులు దీక్ష చేస్తున్నారు. హరీశ్ రావు అన్నదాతలకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు.

రైతులందరీకి రుణ మాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని చెప్పారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 21 లక్షల మంది రైతులకు ఇంకా రుణ మాఫీ కాలేదన్నారు. లెక్క ప్రకారం రుణ మాఫీ చేయాలంటే రూ.31 వేలు కోట్ల కావాలని ప్రభుత్వం అంచనా వేసింది.
అయితే రూ.18 వేల కోట్లకు పైగా మాత్రమే విడుదల చేసినట్లు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మిగతా వారికి ఎప్పుడు రుణ మాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నాలుగో దశ రుణ మాఫీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications