టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడి హఠాన్మరణం... ఆ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సబితా
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన అల్లుడు బి.శ్రీనివాస్ రెడ్డి(55) హఠాన్మరణం చెందారు. కోకాపేటలోని నివాసంలో శనివారం(అగస్టు 30) సాయంత్రం శ్రీనివాసరెడ్డి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం(అగస్టు 1) అర్ధరాత్రి సమయంలో ఆయన కన్నుమూశారు.
మంత్రి సబితారెడ్డి ఆదివారం తీగల కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాస్ రెడ్డి సతీమణిని ఓదార్చారు. అనంతరం శ్రీనివాస్రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని కోరుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా తీగల కుటుంబాన్ని పరామర్శించారు.టీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు శ్రీనివాస్ రెడ్డి మృతిపై సంతాపం ప్రకటించారు.
అమెరికాలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వచ్చిన తర్వాత సోమవారం(అగస్టు 2) సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్లోని మహా ప్రస్థానంలో శ్రీనివాస్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
తీగల కృష్ణారెడ్డి గతంలో జీహెచ్ఎంసీ మేయర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గానూ పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున మహేశ్వరం నియోజకవర్గం నుంచి తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన కృష్ణారెడ్డి ప్రస్తుత మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.ఆయన కోడలు అనితారెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జడ్పీ ఛైర్పర్సన్గా కొనసాగుతున్నారు.
Recommended Video
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏ పదవి దక్కకపోవడంతో తీగల పార్టీ మారుతారేమోనన్న ప్రచారం జరిగింది. ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే ఎమ్మెల్సీ హామీ మేరకు ఆ ప్రయత్నాలను ఆయన విరమించుకున్నట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు.