ఎక్కడ దాక్కున్నాడు?: నయీమ్ అండతో కోట్లకు పడగలెత్తి.. ఇప్పుడు అజ్ఞాతంలో!
ఓ రిటైర్డ్ డీజీపీ సహాయంతో విచారణను తప్పించునేందుకు ఈ ఐపీఎస్ భారీ ఎత్తుగడే వేసినట్లు చెబుతున్నారు. తన వద్ద పనిచేసి సస్పెండ్ అయినవారు.. విచారణలో తన పేరు ప్రస్తావించకుండా ఉండటానికి రిటైర్డ్ డీజీపీని రంగం
హైదరాబాద్: నయీమ్తో అంటకాగి అనేక చీకటి కోణాల్లో వేలుపెట్టిన ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి హఠాత్తుగా మాయమైపోయాడు. నయీమ్ అండ చూసుకుని కోట్లకు పడగలెత్తిన సదరు అధికారి.. ఎక్కడ తన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందోనన్న భయంతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు.
నయీమ్ కేసుకు సంబంధించి సదరు రిటైర్డ్ ఐపీఎస్ను విచారించాలని సిట్ అధికారులు భావిస్తుండటంతో.. విషయం తెలుసుకున్న ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో పాగా వేసి.. కేంద్రం నుంచి ఒత్తిళ్లు తీసుకురావడం ద్వారా విచారణ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలు కూడా అతనిపై ఉన్నాయి.
నయీమ్ అండతో రెచ్చిపోయి:
నయీమ్ కేసులో సస్పెండ్ అయిన ముగ్గురు అధికారులు, విచారణ ఎదుర్కొంటున్న మరో ముగ్గురు అధికారుల ద్వారా ఈ రిటైర్డ్ ఐపీస్ అధికారి తన కార్యకలాపాలు చక్కబెట్టుకున్నట్లుగా సిట్ ధ్రువీకరించింది. భూ దందాల ద్వారా కబ్జా చేసిన భూముల రిజిస్ట్రేషన్ పత్రాలను నయీమ్ ఆయనకు ఇచ్చినట్లుగా నిర్దారించారు. అంతేకాదు, ఢిల్లీలోని ఓ ఇంటిని సైతం నయీమ్ ఈయన కోసం ఇప్పించినట్లు సిట్ వద్ద ఆధారాలున్నాయట.
బంజారాహిల్స్ లో కబ్జా:
నయీమ్ అండతో బంజారాహిల్స్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 500గజాల స్థలం కబ్జా చేసి భవనం నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ స్థలంలో ఓ షోరూమ్ నిర్వహిస్తుండగా.. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అతని తోడల్లుడి పేరు మీద జరిగినట్లు కూడా ధ్రువీకరించారు. రెండు నెలల క్రితం షోరూమ్ లో సోదాలు నిర్వహించినప్పుడు సిట్ అధికారులు దీనికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా సేకరించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లోను నయీమ్ తో దందాలు
ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న సదరు రిటైర్డ్ అధికారి.. గతంలో ఆంధ్రప్రదేశ్ కమిషనరేట్ కు కమిషనర్ పనిచేసిన సమయంలోను నయీమ్ ను అక్కడకు పిలిపించి సెటిల్ మెంట్లు చేసినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. నయీమ్ ద్వారా చేసిన భూకబ్జాలను తోడల్లుడి పేరు మీద ఈ అధికారి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆధారాలు సంపాదించారు. షోరూం నిర్వహణలో భాగంగా ప్రస్తుతం నయీమ్ తోడల్లుడు విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
నయీమ్ కుటుంబంతోను సంబంధాలు:
నయీమ్ కుటుంబానికి చెందిన ఓ యువతిని ఈ ఐపీఎస్ కుటుంబంలోని ఒకరు వివాహం చేసుకున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఆమె పేరిట నగర శివారులోని నాలుగెకరాల భూమి పత్రాలున్నాయని ధ్రువీకరించారు. ఆ యువతిని రిటైర్డ్ ఐపీఎస్ తోడల్లుడి కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించినట్లుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని నయీమ్ భార్య తన వాంగ్మూలంలో పేర్కొనట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈ బంధుత్వాన్ని అడ్డుపెట్టుకునే నయీమ్ ద్వారా అతను కోట్లకు పడగలెత్తాడని గుర్తించారు.
తప్పించుకునేందుకు ఎత్తుగడ:
ఓ రిటైర్డ్ డీజీపీ సహాయంతో విచారణను తప్పించునేందుకు ఈ ఐపీఎస్ భారీ ఎత్తుగడే వేసినట్లు చెబుతున్నారు. తన వద్ద పనిచేసి సస్పెండ్ అయినవారు.. విచారణలో తన పేరు ప్రస్తావించకుండా ఉండటానికి రిటైర్డ్ డీజీపీని రంగంలోకి దించినట్లుగా ఆరోపణలున్నాయి. తన పేరును బయటపడకుండా ఉండటానికి సస్పెండ్ అయి విచారణ ఎదుర్కొంటున్నవారని కాపాడాలని సదరు ఐపీఎస్ కోరినట్లు తెలుస్తోంది.
గతంలో ఈ అధికారి రాజకీయాల్లోకి కూడా దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారని, వర్కవుట్ కావడంతో యూటర్న్ తీసుకున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మాజీ అధికారిని పట్టుకునేందుకు సిట్ అధికారులు వేట ముమ్మరం చేశారు.