అలయ్ బలయ్: 'బిసిలపై మోడీ చిన్న చూపు', 'దత్తన్నకు ఊహించని పదవి'
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఎప్పటిలాగే దసరా పండుగ సందర్భంగా 'అలయ్ బలయ్' సాంస్కృతిక సమ్మేళనాన్ని ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, జేఏసీ చైర్మన్ కోదండరాం, ఎంపీ జితేందర్ రెడ్డి, సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి, వీ హనుమంతరావు, సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేవిధంగా రుచికరమైన తెలంగాణ వంటకాలతో దసరా పండుగ సందర్భంగా దత్తాత్రేయన్న అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోని స్నేహపూర్వక సంస్కృతిని చాటేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నేతలు పాల్గొని.. 'అలయ్-బలయ్' అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని విజయదశమిని విశిష్టతను చాటుతారు.

2022లోపుగా తెలంగాణ నెంబర్వన్గా ఎదగాలి
2022 లోపు దేశంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం కావాలని మాజీ కేంద్ర మంతి బండారు దత్తాత్రేయ ఆకాంక్షను వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణా కావాలని ఆయన ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహ పూర్వక వాతావరణంలో సమస్యలపై చర్చలు జరుపుకోవాలని దత్తన్న సూచించారు. ఇకపై అలయ్ బలయ్ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

అగ్రకులాలకు మోడీ పెద్దపీట
అగ్రకులాలకు మోడీ పెద్ద పీట వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు వ్యాఖ్యానించారు. బిసిలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తాము భావించామన్నారు. కానీ, కేబినెట్ నుండి దత్తాత్రేయను తొలగించడం పట్ల విహెచ్ తప్పుబట్టారు. బిసిలను కేబినెట్ నుండి తొలగించి అగ్రవర్ణాలకు స్థానం కల్పించారని విహెచ్ ఆరోపణలు చేశారు.

దత్తన్న ఊహించని పదవి
బీజేపీ నేత బండారు దత్తాత్రేయ అన్యాయం జరిగిందనడం వాస్తవమేనని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చెప్పారు. దత్తన్నను ఒక్క సామాజిక వర్గానికి పరిమితం చేయొద్దన్నారు. దత్తాత్రేయ స్థాయి ఏంటో ఢిల్లీలో చూశానని, ఆయనకు భవిష్యత్లో ఎవరూ ఉహించని పదవి ఖాయమని కేకే స్పష్టం చేశారు.

లేఖలు పంపిన ఉపరాష్ట్రపతి, ప్రధాని
అలయ్ బలయ్ కార్యక్రమానికి పిలిచినా హాజరుకాలేకపోతున్నానని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక లేఖలో తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా 'అలయ్ బలయ్' విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా 'అలయ్ బలయ్' కార్యక్రమ విశిష్టతను ప్రశంసిస్తూ.. ఒక లేఖలో తన సందేశాన్ని పంపించారు. 13 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం సంతోషం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. మన సంస్కృతి వారసత్వాన్ని ఈ కార్యక్రమం కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. దత్తాత్రేయకు శుభాభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications