ఆ విషయం నన్ను బాధపెట్టింది- వెంకయ్య నాయుడు..!!
హైదరాబాద్: మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని శ్రీహరన్తోపాటు మరో అయిదుమంది జైలు నుంచి విడుదల కావడం పట్ల మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వారు విడుదల కావడాన్ని తప్పు పట్టారు. రాజీవ్ గాంధీని హత్య చేసిన వారి పట్ల కనికరం చూపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
నళిని శ్రీహరన్తో పాటు ఇదే హత్య కేసులో తమిళనాడులోకి రాయవేలూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తోన్న రాబర్ట్ పేస్, రవిచంద్రన్ రాజా, శ్రీహరన్, జయకుమార్.. విడుదలైన విషయం తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు వారిని విడుదల చేశారు. ఆర్టికల్ 142 ఆధారంగా సుప్రీంకోర్టు దోషులను విడుదల చేసింది.
1991 మే నెలలో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ వద్ద ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాజీవ్ గాంధీని మానవ బాంబుతో హత్య చేసినప్పటి నుంచి వారు జైలులోనే గడిపారు. 32 సంవత్సరాల పాటు వారందరూ కారాగార శిక్షను అనుభవించారు. పెరివాలన్ కేసు తరహాలో తమను జైలు జీవితం నుంచి విముక్తి కల్పించాలంటూ వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం సుప్రీంకోర్టు- సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ అయిదుమందీ విడుదల కావడాన్ని వెంకయ్య నాయుడు తప్పుపట్టారు. రాజీవ్గాంధీ హంతకులను వదిలేయడం సరికాదని స్పష్టం చేశారు. వారిపై సానుభూతిని చూపాల్సిన అవసరం లేదనీ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని కొందరు తమ విధానంగా మార్చుకున్నారని, అలాంటి వారి పట్ల కనికరం చూపడం సబబు కాదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులు, సానుభూతిపరులు, ఉగ్రవాదం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు సూచించారు.
రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయడంపై తనకు బాధ కలిగించిందని వ్యాఖ్యానించారాయన. వ్యక్తిగత అభిప్రాయాలు, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేదని, ఈ రెండింటినీ ముడిపెట్టి చూడకూడదని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ హత్యోదంతం అప్పట్లో దేశం మొత్తాన్నీ కదలించిందని, ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసిందని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.