ఇంటి ముందు నిమ్మకాయలు,అగరబత్తీలు... ఇంట్లో నాలుగు మృతదేహాలు...
వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటి ఆవరణలో కుంకుమ,పసుపు,అగరబత్తీలు,నిమ్మకాయలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులను ఆజీరాం బీ(63),ఆమె కుమార్తె ఆస్మా బేగం(35),అల్లుడు ఖాజా పాషా(43),మనుమరాలు హసీనా(10)గా గుర్తించారు. వంట గదిలో అజీరాం బీ మృతదేహాన్ని,డైనింగ్ హాల్లో ఆస్మా బేగం మృతదేహాన్ని,ఇంటి వెనుక ఉన్న ఓ గుంత వద్ద పాషా మృతదేహాన్ని,హాలులో హసీనా మృతదేహాన్ని గుర్తించారు. అంతనంతరం మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతులు ఆత్మహత్యకు పాల్పడ్డారా... లేక ఎవరైనా హత్య చేశారా అన్నది పోస్టుమార్టమ్ నివేదిక ద్వారా క్లారిటీ రానుంది. ఇంటి ఆవరణలో ఉన్న నిమ్మకాయలు,అగరబత్తీలు,కుంకమ వంటివి అక్కడ క్షుద్ర పూజలు జరిగాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి. ఇంట్లో వాళ్లే క్షుద్ర పూజలు చేశారా.. లేక వేరే ఎవరైనా క్షుద్ర పూజలు చేసి వీరిని బలి తీసుకున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.