మావోయిస్టులకు భారీగా డబ్బు, పేలుడు పదార్థాలు తరలిస్తున్న నలుగురి అరెస్ట్
వరంగల్: తెలంగాణలో మరోసారి మావోయిస్టుల అలజడి కలకలం సృష్టించింది. మావోయిస్టులకు భారీ మొత్తంలో డబ్బులు, ఇతర వస్తువులు తరలిస్తున్న నలుగురు బీడీ కాంట్రాక్టర్లను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
నిందితుల వద్ద నుంచి రూ. 76.56 లక్షల నగదు, రూ. 2 లక్షల విలువ చేసే వివిధ సామాగ్రి, మెడికల్ కిట్లు, జిలెటిన్ స్టిక్స్, నాలుగు సెల్ఫోన్లు, ఓ ట్యాబ్, మూడు స్మార్ట్ వాచీలు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కాటారం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా.. ఒక వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో పరిశీలించారు. నలుగురు వ్యక్తులతోపాటు భారీ మొత్తంలో నగదు, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్ తదితర వస్తువులు లభించినట్లు ఎస్పీ తెలిపారు.
నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. కరీంనగర్కు చెందిన అబ్దుల్ అజీజ్, మహమ్మద్ అబ్దుల్ రజాక్, జనగామ రాఘవ్, కౌసర్ అలీలుగా గుర్తించామని తెలిపారు. వీరంతా బీడీ ఆకు కాంట్రాక్టర్లు, అందులోని సిబ్బంది అని చెప్పారు.
నిందితులంతా ఛత్తీస్గఢ్లో తమ బీడీ కాంట్రాక్టు నిర్వహించుకోవడానికి మావోయిస్టులకు ప్రతి సంవత్సరం డబ్బులు, వస్తువులు మామూళ్ల రూపంలో సరఫరా చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. గత సంవత్సరం కూడా రూ. 13 లక్షలు మామూళ్లుగా ఇచ్చారని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నిందితులు ప్రయాణిస్తున్న WB 94 P 4855 స్కార్పియో వాహనాన్ని సీజ్ చేశామని ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. వీరికి సహాయం చేసిన మరికొంతమంది పరారీలో ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications