నలుగురు బంగారం స్మగ్లర్ల అరెస్టు: పరిశీలించిన మహేందర్ రెడ్డి
హైదరాబాద్: నలుగురు బంగారం స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4.2 కిలోల బంగారం బిస్కెట్లు, రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2500 రియాల్స్, 910 యూఏఈ దీరామ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.
ఆ వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. పోలీసులు స్మగ్రర్ల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్లను ఆయన పరిశీలించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళాలు వేసి ఉన్న ఇంటిలో దొంగలు పడి 30 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన సంఘటన హైదరాబాదులోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... టోలిచౌకి నీరజాకాలనీలో తారిఖ్ అన్వర్ హుస్సేన్(25) తన తల్లి, సోదరితో కలిసి నివసిస్తున్నాడు. ఇతడు జెన్పాక్లో పని చేస్తున్నాడు. ఇతడి తల్లి, సోదరి బంధువుల ఇంటికి వెళ్లగా, హుస్సేన్ ఉద్యోగం కోసం వెళ్లాడు.
తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి వెనుక నుంచి గ్రిల్ తొలగించి దొంగతనం జరిగినట్లు గ్రహించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 30 తులాల బంగారు ఆభరణాలు,12 వేల నగదు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.