వీడిన అత్తాపూర్ బాలుడి కిడ్నాప్ మిస్టరీ: ఏపీలో దొరికిన ఆచూకీ, ఏం జరిగిందంటే.?
రెండు వారాల క్రితంలో నగరంలో అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ చేసిన ఓ దుండగుడు.. ఏపీకి తీసుకెళ్లి రూ.లక్షకు అమ్మేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు.
హైదరాబాద్: రెండు వారాల క్రితంలో నగరంలో అపహరణకు గురైన నాలుగేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ చేసిన ఓ దుండగుడు.. ఏపీకి తీసుకెళ్లి రూ.లక్షకు అమ్మేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయాడు. శుక్రవారం రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఏర్పా టు చేసిన సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ పీవీ పద్మజ ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన శరణప్ప హైదరాబాద్ అత్తాపూర్లోని నందిముస్లాయిగూ డలో ఐదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. అతడి నాలుగేళ్ల కుమారుడు నాగేశ్(4)సెప్టెంబర్ 7న ఇంటి ముందు ఆడుకొంటుండగా కిడ్నాప్కు గురయ్యాడు. శరణప్ప ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పోలీస్ వాట్సాప్ గ్రూప్లో బాలుడి ఫొటో, వివరాలు పెట్టి ఆచూకీ దొరికితే సమాచారం అందించాలని సూచించారు. ఈ క్రమంలో బాలుడు ఏపీలోని గుంతకల్లులో ఉన్నట్టు అక్కడి పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఏపీలోని కడప జిల్లా కొండూరు మండలానికి చెందిన సుంకర గంగయ్య(29) మూడేళ్లుగా అనంతపురం జిల్లా గుంతకల్లులో నివాసం ఉంటున్నాడు.
రెండు నెలల కిందట నందిముస్లాయిగూడకు వచ్చి రోడ్డు పక్కన గుడిసె వేసుకున్నాడు. ఆటోలో తిరుగుతూ ఆయుర్వేద మందులు అమ్ముతున్నాడు. సెప్టెంబర్ 7న నాగేశ్ను కిడ్నాప్ చేసి, లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి గుంతకల్లుకు వెళ్లిపోయాడు. బాలుడిని రూ.లక్షకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడి పోలీసులు పట్టుకున్నారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు గుంతకల్లుకు చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుకున్నారు. అతడ్ని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.