తెలంగాణలో సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్: కేసీఆర్ కీలక నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని క్షౌర వృత్తి శాలలకు (హెయిర్ సెలూన్లు), లాండ్రీ షాపులకు, దోభీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఈ విషయమై పలు విజ్ఞప్తులు చేశాయి. ఈ విజ్జప్తులను సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకోసం తక్షణం జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించారు.సీఎం ఆదేశాల మేరకు అధికారులు తాజాగా జీవోను విడుదల చేశారు.

హెయిర్ సెలూన్లు, దోభీఘాట్లకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ జీవో ప్రకారం ఉచిత విద్యుత్ సరఫరా అమల్లోకి రానుంది. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అత్యంత బలహీన వర్గాల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
దీంతో మారుమూల గ్రామ స్థాయినుంచి గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) వరకు గల అన్ని హెయిర్ సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దోభీ ఘాట్లకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంట్ ఉచితంగా అందుబాటులోకి రానున్నదని సీఎం తెలిపారు.
తాజా నిర్ణయంతో తర తరాలుగా కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనం కొనసాగిస్తున్న రాష్ట్రంలోని లక్షల రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని సీఎం కేసీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications