గుడ్ న్యూస్: తెలంగాణా రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్..సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్న కేసీఆర్, మే ఒకటి నుండి 18 ఏళ్ళ వయస్సు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక నిర్ణయం వెల్లడించారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణా రాష్ట్ర ప్రజలందరికీ ఫ్రీగా వ్యాక్సినేషన్
18 ఏళ్ల నుండి 45 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. ఇక తాజాగా తెలంగాణ సర్కారు కూడా ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది . ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులను ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం జనాభాకు వ్యాక్సిన్ పంపిణీ చేయనుంది. దీని వల్ల ప్రభుత్వంపై 2,500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని తెలుస్తుంది. అయినాసరే ఈ నిర్ణయం తీసుకుంది .

వ్యాక్సినేషన్ తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్
వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తానని రెండు, మూడు రోజుల్లో వైద్య పరీక్షల తర్వాత అధికారులతో సమీక్ష జరుపుతానని వివరించారు. ఇదే సమయంలో ఆక్సిజన్, రెమిడెసివిర్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదని పునరుద్ఘాటించిన సీఎం కేసీఆర్ జిల్లాల వారీగా ఇన్చార్జిల నియామకం తో వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్య రక్షణకు పెద్ద పీట వేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు
ఇదిలా ఉంటే హర్యానా ప్రభుత్వం కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. మరికొన్ని రాష్ట్రాలు వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.ఇక మరోవైపు కేంద్రం తాము కొనుగోలు చేసిన కరోనా వ్యాక్సిన్ లను రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించింది . రాష్ట్రాలు కొనుగోలు చేసే వ్యాక్సిన్ ధరల విషయంలో మాట మాత్రం కూడా మాట్లాడలేదు. కానీ రాష్ట్రాలు మాత్రం ప్రజల ఆరోగ్య రక్షణకు వ్యాక్సిన్ లను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా ఇస్తామని చెప్పటం గమనార్హం . ముఖ్యంగా తెలుగురాష్ట్రాలు వ్యాక్సినేషన్ విషయంలో ముందుగా నిర్ణయం తీసుకోవటం హర్షనీయం .












Click it and Unblock the Notifications