కేసీఆర్ను నమ్మితే నీకు, నీ రాష్ట్రానికి చీకటే: వైఎస్ జగన్కు రేవంత్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. తాజాగా ఆంద్రప్రదేశ్ శాసనమండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ సర్కారు తీర్మానం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లారు.

కేసీఆర్తో స్నేహం వల్లే..
తెలంగాణ సీఎం కేసీఆర్తో స్నేహం చేయడం వల్లే మండలి రద్దు వంటి వ్యవస్థల విధ్వంసానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పూనుకున్నారని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో అస్థిర పరిస్థితులు నెలకొంటే తమకు ఇబ్బంది ఉండదనే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఈ తరహా సలహాలు ఇచ్చినట్లు అనిపిస్తోందన్నారు. కేసీఆర్తో జగన్ తన స్నేహాన్ని ఇదేవిధంగా కొనసాగించినట్లయితే.. ఆయనతోపాటు ఏపీ భవిష్యత్ కూడా అంధకారమే అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ నమ్మినవారు చరిత్రలో బాగుపడలేదు..
లోక్సభలో బిల్లులు ఆమోదం పొంది.. రాజ్యసభలో తిరస్కరణకు గురవడం.. సెలెక్ట్ కమిటీకి పంపడం లాంటి సందర్భాలున్నాయని.. అంత మాత్రాన రాజ్యసభను రద్దు చేయాలనో.. పెద్దల సభల నుంచి సలహాలు, సూచనలు వద్దని ఏ ప్రధాని చెప్పలేదని రేవంత్ తెలిపారు. పెద్దల సభలో బిల్లు ఆమోదం పొందనంత మాత్రాన సభనే రద్దు చేయడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను నమ్మినవారు బాగుపడినట్లు చరిత్రలో లేదని ఎద్దేవా చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, 2009లో చంద్రబాబుకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని అన్నారు.

అంతా చీకటే.. వెలుగుండదు..
2014 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్కు నమ్మబలికి కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారని రేవంత్ విమర్శించారు. ఇక 2019లో జగన్తో కేసీఆర్ జట్టు కట్టారని రేవంత్ చెప్పారు. ఒక వ్యక్తి నేపథ్యం, ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేయాలన్నారు. కేసీఆర్ సలహాలను జగన్ పాటిస్తే మాత్రం ఆయనకు భవిష్యత్ చీకటి తప్ప వెలుగు ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో శాసనమండలిని రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications