కూలీ కుమార్తె కొట్టి చూపించింది.. రూ. 51 లక్షల ప్యాకేజీతో..
కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఆ సూక్తిని ఆమె నిజం చేసింది. వ్యవసాయ కూలీ కుమార్తె అద్భుతం చేసింది. కష్టపడి చదివించిన ఆ తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. ఆ గ్రామానికే పేరు తెచ్చింది. ఏకంగా రూ.51 లక్షల ప్యాకేజీతో ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం సాధించి ఔరా అనిపించింది. మంచిర్యాల జిల్లాలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన రవీన.. తన అసాధారణ ప్రతిభతో మైక్రోసాఫ్ట్ లో కొలువు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ముడిమడుగు గ్రామానికి చెందిన రవీన. ఓ వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబానికి ఆమె వెలుగు తీసుకొచ్చింది. కాగజ్నగర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువు పూర్తి చేసింది. 2022లో 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్ లేకుండానే తన కృషి, ప్రతిభతో జేఈఈ లో అర్హత సాధించి అలహాబాద్ ఐఐటీలో అడ్మిషన్ సంపాదించింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఆమె రికార్డు సృష్టించింది. ఏకంగా ఏడాదికి రూ.51 లక్షల ప్యాకేజీతో ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం సాధించి ఆశ్చర్యపరిచింది.

ఈ మేరకు ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ మాట్లాడుతూ.. రవీన ఎల్లప్పుడూ క్రమశిక్షణతో చదువులో ముందంజలో ఉండేదని తెలిపారు. తల్లిదండ్రుల కష్టం విలువ తెలుసుకుని, అంకితభావంతోపాటు పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న రవీనను స్థానికులు, అధ్యాపకుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సంకల్పానికి పేదరికం అడ్డుకాదని నిరూపించిన రవీన విజయగాథ ఎంతోమంది యువతకు స్ఫూర్తిదాయకం.












Click it and Unblock the Notifications