చేతులు మారిన నిధులు.!కాళేశ్వరంపై కమ్ముకున్ననీలి 'మేఘా'లు.!విచారణ కోసం సీఎంకు రేవంత్ లేఖాస్త్రం.!
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబందించిన కాంట్రాక్టర్ మరో వివాదానికి కేంద్ర బిందువయ్యాడని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేసారు. మొదట్లో ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని ఎంత నిర్ధారించారు.?తర్వాత అంచనా వ్యయానికి మించి ఎన్ని వేల కోట్లకు ప్రాజెక్టు చేరిందో స్పష్టం చేయాలని సీఎం చంద్రశేఖర్ రావుకు రేవంత్ రెడ్డి లేఖ రాసారు. అంతే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ నుంచి ప్రభుత్వంలోని పెద్దల చేతులకు చేరాయని, వీటన్నిటి పైన సమగ్ర విచారణ జరపాలని రేవంత్ రెడ్డి లేఖలో డిమాండ్ చేసారు.
కాళేశ్వరం కాంట్రాక్టర్ కు వేల కోట్లు.!విచారణ కోసం రేవంత్ సీఎంకు లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగతోందని, వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు సందేహాలు కలుగుతున్నయని,కాంగ్రెస్ పార్టీ మొదటినుండీ చెప్తుకొస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రాసిన లేఖలో రేవంత్ స్పష్టం చేసారు. క్విడ్ ప్రోకో జరిగుతున్నట్టు ప్రతిపక్ష పార్టీలు అనుమానాలను వ్యక్తం చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని లేఖలో రేవంత్ వివరించారు. నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించే ఓ ప్రభుత్వ అధికారి కుటుంబ వేడుకకు సంబందించి లావాదేవీలు వెలుగులోకి రావడంతో మొత్తం వ్యవమారం వెలుగుచూసిందని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆధారాలు బయటపెట్టిన ఓ పోర్టల్.. వివరణ ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి
ఇక సీఎం చంద్రశేఖర్ రావు కు రాసిన లేఖలోని సారాంశం ఈ విధంగా ఉంది. మీరు ప్రతిష్టాత్మకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి పై "ది న్యూస్ మినిట్ "అనే పోర్టల్ ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చూస్తున్న ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ అవినీతి కి పాల్పడ్డారని పోర్టల్ లో పేర్కొన్నారు. రజత్ కుమార్ కుమార్తె పెళ్లి ఖర్చులకు కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన మెగా, దాని షేల్ కంపెనీలు చెల్లించినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 17 - 18 హైదరాబాద్ లోని ఫలక్ నుమా ఫ్యాలాస్,తాజ్ డెక్కన్,తాజ్ కృష్ణా వంటి ఫైవ్ స్టార్ హోటల్లో నిర్వహించినట్లు కథనంలో పేర్కొన్నారని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సందేహాలు నిజమయ్యాయి.. క్విడ్ ప్రోకో జరిగినట్టు సాక్షాలు వెలుగుచూసాయన్న రేవంత్
అంతే కాకుండా మరింత లోతైన అంశాలను సీఎం చంద్రశేఖర్ రావుకు రేవంత్ లేఖలో గుర్తుచేసారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. సాగునీటి శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో మీరే నిర్వహిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ మీ పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. ఆరోపణలు వచ్చిన 48 గంటలు కావస్తున్నా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఖండన ప్రకటన రాలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి ఆరోపణలపై వాస్తవాలను తెలంగాణ సమాజానికి వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నాం. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి 50 లక్షల పైచిలుకు బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఈ షెల్ కంపనీ లకు ఎందుకు ఉంటుందని రేవంత్ సీఎం చంద్రశేఖర్ రావును లేఖలో సూటిగా ప్రశ్నించారు.
నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్న పిసీసీ ఛీఫ్
ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ జరపాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. ప్రభుత్వంలో పెద్దలకు ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ నుంచి వేల కోట్లు ముడుపులు అందినట్లు ఆరోపణలున్నాయని అన్నారు. ఆ ఆరోపణకు వివాహ వేడుక కోసం సదరు కాంట్రాక్టర్ చేసిన ఖర్చు సాక్ష్యంగా నిలుస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పారదర్శకతను నిరూపించుకోవాలంటే నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుంచాలని రేవంత్ రెడ్డి సీఎం చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.