హైదరాబాద్ శివారు రూపురేఖలు మారిపోతాయ్- న్యూయార్క్ ను తలదన్నేలా..!!
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకోబోతోంది. ఈ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఆవిర్భవించింది. ఈ అథారిటీ ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి కిందటే శంకుస్థాపన చేశారు. భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ ఉద్దేశాలను పునరుద్ఘాటించారు.
పదేళ్లు అవకాశం..
తనకు మరో 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం ఇవ్వలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ పదేళ్లల్లో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతానని, ఇందులో అత్యంత కీలకమైన భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా ఉందని అన్నారు. న్యూయార్క్, దుబాయ్లతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలనేదే తన ఉద్దేశమని తేల్చి చెప్పారు. న్యూయార్క్లో ఉండేవాళ్లు కూడా ఇక్కడికి వచ్చేలా చేస్తానని చెప్పారు.

బుల్లెట్ ట్రైన్..
ప్రపంచంలో అనేక ప్రధాన నగరాలను తలదన్నేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తానని రేవంత్ పేర్కొన్నారు. అలాంటి నగరాన్ని ఎందుకు నిర్మించకోకూడదని ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తామని, బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించానని అన్నారు. అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ వస్తుందని, అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఇస్తామని వివరించారు.
కోర్టులో కేసులు వేయొద్దు..
ఫ్యూచర్ సిటీ నిర్మాణం వల్ల భూములను కోల్పోయే రైతులు, వాటి యజమానులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని, కోర్టులో కేసులు వేయడం వల్ల నష్టపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. విజయదశమి మనకు అన్ని విజయాలను చేకూరుస్తుందని, అందుకే ఆ ముహూర్తంలోనే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశానని చెప్పారు.
వైఎస్సార్, చంద్రబాబు..
దీన్ని అడ్డుకోవడానికి చాలా మంది కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. ఇక్కడ తనకు భూములు ఉన్నాయని, ఆ కారణంతోనే ప్రత్యేకంగా సిటీని కట్టుకుంటున్నాడని చెబుతున్నారని అన్నారు. కుతుబ్ షాహీలు నగరాన్ని నిర్మిస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు దాన్ని కొనసాగించారని, వాళ్లు ఆ ఆలోచన చేయబట్టే ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతున్నామని పేర్కొన్నారు. వారు మాకెందుకులే అనుకుంటే ఓఆర్ఆర్, శంషాబాద్, హైటెక్ సిటీ వచ్చేవి కాదని రేవంత్ చెప్పారు.
756 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..
ఫ్యూచర్ సిటీ నిర్మాణం మొత్తం 756 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 56 రెవెన్యూ గ్రామాలు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఏడు మండలాలు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC), FCDA సహకారంతో 15,000 ఎకరాలలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. దీనికి అదనంగా మరో 15,000 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్ గా ఉన్నాయి.
కొత్త ఆర్థిక కేంద్రాలు..
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రధాన లక్ష్యం.. హైదరాబాద్పై అన్ని రకాలుగా ఒత్తిడిని తగ్గించడం. అలాగే కొత్త ఆర్థిక కేంద్రాలను సృష్టించడం, ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించడం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ సిటీ నిర్మాణానికి పూనుకున్నారు రేవంత్. లైఫ్ సైన్సెస్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, విజ్ఞాన ఆధారిత పరిశ్రమలు, గ్రీన్ ఇండస్ట్రీస్, వినోదం, ఎకోటూరిజం వంటివి ఈ ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి.












Click it and Unblock the Notifications