నిజమే: గద్దర్ పూజలు చేశారు, కెసిఆర్ను ప్రశంసించారు
విప్లవోద్యమాన్ని గానం చేస్తూ దైవాన్ని తృణీకరిస్తూ వచ్చిన గద్దర్ ఒక్కసారిగా కొమురెల్లి మల్లన్న చెంత పూజలు చేశారు. కెసిఆర్ను ప్రశంసలతో ముంచెత్తారు.
చేర్యాల: ప్రజాకవి గద్దర్ దైవాన్ని ఆశ్రయించారు. పూజలు చేసి భజన పాటలు పాడారు.. వేద పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పారు. స్వామి వివేకానందుడిని ప్రశంసించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కొనియాడారు. సోమవారం కొమురవెల్లి మల్లన్నను ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
మల్లన్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఆలయంలో నిర్వహించిన లక్ష బిల్వార్చనకు గద్దర్ తన భార్య విమల, కోడలు సరితతో కలిసి వచ్చారు. స్వామివారిని దర్శించుకొని.. అభిషేకం, పూజలు నిర్వహించారు. తన చిన్నతనంలో మల్లన్నను చూడటానికి తల్లితో కలిసి వచ్చానని, అయితే మల్లన్న సొరికెలో ఉంటాడని, దర్శించుకోవడానికి వీలుకాదని చెప్పడంతో బయటినుంచే మొక్కి వెళ్లిపోయామని ఆయన చెప్పారు. అప్పుడు తీరని ఆకాంక్ష ఇప్పుడు తీరిందని చెప్పారు.
''కొమురెల్లి మల్లన్నను చూడు.. సొరికెల్లో కొలువై ఉన్నాడు'' అని మల్లన్నపై పాటరాశానని గుర్తుచేశారు. తెలంగాణ రావాలని మల్లన్నకు ముడుపుకట్టానని, అనుకున్నట్లుగానే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, కేసీఆర్ కృషివల్ల రాష్ట్రం సిద్ధించిందని గద్దర్ చెప్పారు.
ప్రత్యేక రాష్ట్ర ఫలాలు అందరికీ అందాలన్నదే తన అభిమతమని అన్నారు. అభివృద్ధి నిరోధకుల ను ప్రశ్నించేందుకు తన భార్య విమల పోరాట బాధ్యత చేపట్టనున్నట్లు గద్దర్ తెలిపారు. అనంతరం 'పొడుస్తున్న పొద్దుమీద..' పాటపాడటంతోపాటు ''శివాయ నమః శివాయ నా'' అంటూ భజన చేశారు.
ఆ తర్వాత వీరశైవాగమ వేద పాఠశాల విద్యార్థులకు గద్దర్ పాఠాలు బోధించారు. వేదాలతోపాటు ఇంగ్లిషు నేర్చుకోవాలని, వివేకానందుడిలా అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రకృతిని ఆరాధించే ప్రతివాడూ భక్తుడేనని సమాధానమిచ్చారు.