షర్మిల పాట పాడుతున్న గద్దర్.. కేసీఆర్ పతనం ఆరంభం అంటూ సంచలనం
ప్రజాయుద్ధ నౌక గద్దర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ షర్మిల చేపట్టిన టి సేవ్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన ఆయన కెసిఆర్ పతనం మొదలైందని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని అందరూ భావిస్తే కెసిఆర్ పాలనలో ప్రజలకు కన్నీళ్లు మిగిలాయని గద్దర్ విమర్శలు గుప్పించారు.
ఎంతో మంది అమరుల ఆత్మబలిదానాలతో, తెలంగాణ ప్రజలు చిందించిన రక్తంతో గద్దెనెక్కిన కేసీఆర్ ను గద్దె దించేలా యువత దీక్ష తీసుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు. కెసిఆర్ కు ఓటుతో సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ బిడ్డ అంటూ గద్దర్ ఆమెకు మద్దతు ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న నినాదంతో షర్మిల తన పోరాటాన్ని మొదలుపెట్టారని పేర్కొన్నారు.

నిన్న మొన్నటి వరకు మంత్రులు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. 30 నుండి మంత్రులందరూ మన ముందే ఉంటారని వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కోసం ఎంతో మంది యువత లైబ్రరీలలో వాడిపోయిన మొహాలతో ఎదురుచూస్తున్నారని గద్దర్ పేర్కొన్నారు. ఇక షర్మిల తన ఆత్మరక్షణ కోసమే డిఫెన్స్ చేశారని, ఆమె పోలీసులను కొట్టలేదని గద్దర్ పేర్కొన్నారు. షర్మిల రాజకీయ శక్తిగా ఎదిగింది కాబట్టి ఆమెను బయటకు రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు .
షర్మిల తెలంగాణ నాడి పట్టుకున్నారని అందుకే షర్మిలను అడుగడుగునా అడ్డుకుంటున్నారని గద్దర్ పేర్కొన్నారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్న గద్దర్ ఓట్ల యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిని బూత్ కమిటీ గా మార్చాలని పేర్కొన్నారు. డబ్బుతోనే అధికారంలోకి రావచ్చని కేసీఆర్ ఫిక్స్ అయ్యారని, విద్యార్థులు రాజకీయ శక్తిగా మారి బుద్ధి చెప్పాలని గద్దర్ పేర్కొన్నారు.
కెసిఆర్ అధికారంలోకి వచ్చే సమయంలో ఆయన దగ్గర ఉద్యమాలు ఉన్నాయి కానీ డబ్బులు లేవని, ఇప్పుడు కెసిఆర్ వద్ద ఉద్యమాలు లేవని డబ్బులు మాత్రమే ఉన్నాయని, ఉద్యమాలు మన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మనం పిల్లులతో కొట్లాడుతున్న ఎలుకలం అంటూ పేర్కొన్న గద్దర్ అసెంబ్లీ, సెక్రటేరియట్ ను విద్యార్థులు చుట్టుముట్టి పోరాటాలు చేయాలన్నారు. కెసిఆర్ పతనమయ్యే దశ వచ్చిందని ఆయన తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications