ఆదిభట్లలో నయీం భూదందా: నగరంలో పదుల సంఖ్యలో ఇళ్లు కబ్జా
హైదరాబాద్: పోలీసులు ఎదురు కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ నయీం హతమైన తర్వాత అతడు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వందకు పైగా కేసులు, భూదందాలు, సెటిల్ మెంట్లు చేసిన నయీం నేరాల చిట్టా చాలా పెద్దదే. మూడేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలోని ఆదిభట్ల సమీపంలో నయీం చేసిన భూదందాకు సంబంధించి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
మంగళ్పల్లి, ఆదిభట్ల సమీపంలోని ఓ రైతుకు చెందిన 21 ఎకరాల భూమిపై నయీం కన్ను వేశాడు. దీంతో అతడికి చెందిన కొందరు అనుచరులు ఆ రైతును పలు విధాలుగా బెదిరించి భూమిని లాక్కునేందుకు ప్రయత్నించారని పోలీసులు విచారణలో వెల్లడైంది.
నగరంలో పదుల సంఖ్యలో ఇళ్లు కబ్జా
ఈ భూదందాలో భాగంగా రైతుని తుపాకులతో బెదిరించడంతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆ రైతు ఓ రాజకీయ నాయకుడి సహాయంతో నయీం గ్యాంగ్కు ఎదురుతిరిగి వారి భూదందాకు అడ్డుపడినట్లు సమాచారం. హైదరాబాద్ నగర శివార్లతో పాటు నగరంలో కూడా పదుల సంఖ్యలో నయీం ఇళ్లను కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది.
నగరంలో పదుల సంఖ్యలో ఇళ్లు కబ్జా
అమాయుకులను బెదిరించి తాను కబ్జా చేసిన ఇళ్లను బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించేవాడని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ఇందులో భాగంగా శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో నయీం ఓ అధునాతన ఇంటిని నిర్మించి అద్దెకు ఇచ్చాడు.
నగరంలో పదుల సంఖ్యలో ఇళ్లు కబ్జా
ఈ స్థల యజమానిని బెదిరించి తన అనుచరురాలైన ఫర్హానా సుల్తానా పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ ఇంటిలో అద్దెకు ఉంటున్న వారు తాము ఏనాడు ఇంటి ఓనర్ను చూడలేదని పేర్కొన్నారు. ఎవరో అనామకులు వచ్చి ఈ ఇల్లు తమదేనని చెప్తూ ఉంటారని వారు తెలిపారు.
నగరంలో పదుల సంఖ్యలో ఇళ్లు కబ్జా
ఓనర్స్ ఎవరో తమకు తెలియకపోయినప్పటికీ, ఇంటి పక్కనే ఉన్న గౌడ్ అనే వ్యక్తికి నెల నెలా ఇంటి అద్దెను చెల్లిస్తున్నట్లు వారు మీడియాకు వెల్లడించారు. అయితే హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల నయీంకు ఇలాంటి ఇళ్లు ఎన్ని ఉన్నాయో అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.