ప్రయాణికుల్లా లగేజీతో అమాయకంగా రైలెక్కి.. చేసే దందా చూస్తే షాక్!
చేతిలో బ్యాగ్ తో రైలు ఎక్కారంటే వారు ఏదో ఊరికి వెళుతున్నారని, ప్రయాణికులని భావిస్తాం. సహజంగా రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికులను ప్రతి ఒక్కరిని చెకింగ్ చేయడం సాధ్యం కాదు. ఇక ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు రైళ్ల ద్వారా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి యదేచ్ఛగా మహారాష్ట్రతో పాటు, ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు.
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్
తాజాగా కాజీపేట రైల్వే పోలీసులు ప్రయాణికుల్లా నటిస్తూ లగేజీ బ్యాగులలో బట్టల చాటుగా గంజాయి పొట్లాలను అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తున్న ఈ గ్యాంగ్ అక్రమ రవాణా చేస్తున్న 32 కిలోల గంజాయిని నేడు కాజీపేట రైల్వే పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 16 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ప్రయాణికులుగా లగేజీ బ్యాగుల్లో గంజాయి పొట్లాలతో
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు పురుషులు కాగా, ఒకరు మహిళ ఉన్నారని వీరంతా ఒరిస్సా వాసులని కాజీపేట grp సీఐ వడ్డే నరేష్ కుమార్ తెలిపారు. వీరు ప్రయాణికులుగా లగేజీ బ్యాగుల్లో గంజాయి పొట్లాలను తరలిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ ముఠాకు చెందిన మరో ఇద్దరు కీలక నిందితులు పరారీలో ఉన్నారని వారికోసం గాలింపు కొనసాగుతున్నట్టు తెలిపారు.
రైళ్ళ ద్వారా గంజాయి స్మగ్లింగ్ అరికట్టాలంటే
నిందితులపై ndps చట్టం కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్టు పేర్కొన్నారు. చాలాకాలంగా గంజాయి స్మగ్లర్లు రైళ్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. రైళ్ల ద్వారా జరుగుతున్న ఈ గంజాయి స్మగ్లింగ్ పైన రైల్వే పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించాలి. రైళ్లు అసాంఘిక కార్యకలాపాలకు వాహికగా మారకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రైళ్ల ద్వారా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ అరికట్టడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications