ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నంద కుమార్ కు భారీ జలక్..!!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నించారనే కేసులో నిందితుడుగా ఉన్న నందకుమార్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే ఈ కేసు వ్యవహారంలో ఆయన మిగిలిన ఇద్దరు నిందుతలతో పాటుగా విచారణ ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఈ ముగ్గురు చేసిన ప్రయత్నాల వీడియోలను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బయట పెట్టారు. ఈ ముగ్గురి పైన ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ సమయంలో మరో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది.
హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా.. నందకుమార్ కు చెందిన హోటల్ దక్కన్ కిచెన్ సమీపంలోని రెండు నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. దక్కన్ కిచెన్ ను ప్రమోద్ కుమార్ అనే వ్యక్తితో కలిసి నందకుమార్ నిర్వహిస్తున్నారు. అక్రమ నిర్మాణాల్లో వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు గతంలోనే దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చారు.
అయినా, ఆపకపోవటంతో పోలీసుల బందోబస్తు నడుమ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేత ప్రారంభించారు. ఇదే సమయంలో.. సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ తనకు అమ్మిన భూమిని ఆయన కొడుకు రానా పేరున రిజిస్ట్రేషన్ చేశారంటూ సదరన్ స్పైస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నందకుమార్ గతంలో ఆరోపించారు.
ఫిలింనగర్లో తనకు అగ్రిమెంట్ చేసిన భూమిని తనతో పాటు మరొకరికి కూడా అగ్రిమెంట్ చేసి మోసం చేశారని ఆయన అప్పట్లో నందకుమార్ ఆరోపణలు చేసారు. దగ్గుబాటి కుటుంబం నుంచి నందకుమార్ ఈ భూమిని లీజుకు తీసుకున్నట్లు సమాచారం. అటు సుప్రీం కోర్టులో ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్నవారి తరపున పిటీషన్ దాఖలైంది. ఇటు ఇదే కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఇప్పటికే వీరిని విచారణ చేయటం ప్రారంభించింది.