GHMC Elections 2020 Exit Poll Results -నాగన్న సర్వేలోనే టీఆర్ఎస్కు 100 -బండి సంజయ్ తుస్
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. సాధారణ ఎన్నికల స్థాయిలో బడా నేతలు ప్రచారం చేయడంతో ఈసారి బల్దియా ఎన్నికలకు ఎనలేని ప్రచారం దక్కింది. ఎన్నికల సంఘం అధికారికంగా ఓట్ల లెక్కింపును శుక్రవారం(డిసెంబర్ 4న) చేపట్టనుంది. అయితే, పోలింగ్ కేంద్రాల్లో ఓటేసిన తర్వాత జనం నుంచి సేకరించిన అభిప్రాయాలతో పలు సర్వేలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించాయి. ఈసారి కూడా..
బల్దియాపై గులాబీ జెండా..
గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి కూడా టీఆర్ఎస్ పార్టీనే విజేతగా అవతరించబోతున్నట్లు అన్ని సర్వేలు ముక్తకంఠంతో చెప్పాయి. అయితే కాంగ్రెస్, టీడీపీలు పూర్తిగా చతికిలపడిన నేపథ్యంలో బిగ్గెస్ట్ గెయినర్ గా బీజేపీ అవతరించినట్లు ఎగ్జిట్ ఫలితాల్లో వెల్లడైంది. ఎంఐఎం తన కంచుకోట ఓల్డ్ సిటీపై పట్టును యధావిధిగా కొనసాగించినట్లు తేలిపోయింది. కాగా, సీట్ల విషయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ‘100 సీట్లు గ్యారెంటీ' ఛాలెంజ్ తుస్సుమన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఆయా సర్వేల ప్రకటనలు ఇలా ఉన్నాయి..
నాగన్న సర్వేలో టీఆర్ఎస్కు 100
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై అర డజనుకుపైగా సంస్థలు సర్వేలు విడుదల చేశాయి. వాటిలో థార్డ్ విజన్ రీసెర్చ్(నాగన్న సర్వే) మాత్రమే టీఆర్ఎస్ కు 100 సీట్లు వస్తాయని అంచనా వేస్తోంది. నాగన్న సర్వే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 95 నుంచి 100 సీట్లు, బీజేపీకి 5 నుంచి 12 సీట్లు, ఎంఐఎంకు 35 నుంచి 38 సీట్లు, కాంగ్రెస్ కు సున్నా నుంచి 1 సీటు లభించే అవకాశం ఉంది. మరో ప్రముఖ సర్వే ‘ఆరా' అంచనాల ప్రకారం టీఆర్ఎస్ 78(ప్లస్ ఆర్ మైనస్ 7) సీట్లు, బీజేపీ 28(ప్లస్ ఆర్ మైనర్ 5), ఎంఐఎం 41(ప్లస్ ఆర్ మైనర్ 5), కాంగ్రెస్ 3(ప్లస్ ఆర్ మైనస్ 3) సీట్లు సాధిస్తుందని చెప్పింది. ఇక ..
సీపీఎస్ సర్వే ఫలితాలిలా..
గత ఎన్నికల్లో సీట్లు, ఓట్ల పరంగా సింగిల్ డిజిట్ కు పరిమితమైన బీజేపీ ఈసారి ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకున్నట్లు ఎగ్జిట్ పోల్ స్వేల్లో వెల్లడైంది. సీపీఎస్ సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ కు 39.8 శాతం ఓట్లు, బీజేపీకి 27.9 శాతం, ఎంఐఎంకు 13.4 శాతం, కాంగ్రెస్ కు 14.7 శాతం ఓట్లు దక్కాయి. అదే సీట్ల దగ్గరికొస్తే.. టీఆర్ఎస్ కు 82 నుంచి 96సీట్లు, బీజేపీ 12 నుంచి 20, ఎంఐఎం 32 నుంచి 38, కాంగ్రెస్ 3 నుంచి 5 సీట్లు గెలుస్తుందని సీపీఎస్ అంచనా వేస్తోంది. ఇక..
పీపుల్స్, ఎన్ఎఫ్ఓ సర్వే ఫలితాలివి..
మరో ప్రముఖ సర్వే సంస్థ పీపుల్స్ పల్స్ అంచనాల ప్రకారం టీఆర్ఎస్ కు 38 శాతం ఓట్లు, బీజేపీకి 32 శాతం, ఎంఐఎం 13 శాతం, కాంగ్రెస్ 12 శాతం, ఇతరులు 5 శాతం ఓట్లు సాధించారు. పీపుల్స్ లెక్కల ప్రకారం టీఆర్ఎస్ 68 నుంచి 78 సీట్లు, బీజేపీ 25 నుంచి 35, ఎంఐఎం 38 నుంచి 42 సీట్లు, కాంగ్రెస్ 1 నుంచి 5 సీట్లు గెలుచుకోనుంది. ఇక ఎన్ఎఫ్ఓ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 85 నుంచి 95 సీట్లు, బీజేపీకి 15 నుంచి 25 సీట్లు దక్కుతాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా, ఎన్నికల సంఘం చెప్పే అసలైన ఫలితాల మాత్రం శుక్రవారం వెలువడనున్నాయి.
నారా లోకేశ్ మెడకు సీఐడీ ఉచ్చు -హైకోర్టుకు ఆధారాలు - ప్రభుత్వానికి నష్టమేంటన్న జడ్జి -తీర్పు రిజర్వ్