హైదరాబాద్లో చంద్రబాబు ఇంటిపై ట్విస్ట్: కాంపౌండ్ ఫీజు విధింపు?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో నిర్మిస్తున్న ఇంటిపై వివాదం మరో మలుపు తిరగనుంది. నిబంధనలకు విరుద్ధమని, ప్లాన్ను సవరించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఫైల్ను వెనక్కి పంపిన జీహెచ్ఎంసీ తదుపరి చర్యల దిశగా అడుగులు వేస్తోంది.
అనుమతి ఇవ్వకముందే పనులు ప్రారంభించారని పేర్కొంటూ 33 శాతం కాంపౌండింగ్ ఫీజు విధించాలని జిహెచ్ఎంసి నిర్ణయించినట్లు సమాచారం. అనుమతి తీసుకోకుండా నిర్మించి తదుపరి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు విధించే రుసుము కాంపౌండింగ్ ఫీజు. ఈ విషయంపై పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అంతర్గత చర్చలు జరుపుతున్నారు.
అనుమతుల జారీ సమయానికి ఎంత వరకు పనులు జరిగాయి అనే విషయాన్ని బట్టి అపరాధ రుసుము విధించే అవకాశముంది. ప్రస్తుతం పిల్లర్లు, కాలమ్ పనులు జరుగుతున్నట్టు గుర్తించామంటున్న జీహెచ్ఎంసీ వర్గాలు ఇతర రుసుములకు అదనంగా అపరాధ రుసుము విధించాలని అనుకుంటోంది. భవనం ఎత్తును 13 నుంచి 10 మీటర్లకు తగ్గించాలని, ప్లాన్లో చూపిన నిర్మాణ స్థలం పోనూ మిగతాది ఏం చేశారనే దానిపై స్పష్టతనివ్వాలని, ఆ డాక్యుమెంట్లతో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
లోటస్పాండ్లోని వైఎస్ జగన్ అక్రమ భవంతిపై చర్యలకు జీహెచ్ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రశ్నించారు. దాదాపు 88 డబుల్ బెడ్రూం ఇళ్లతో సమానమైన జగన్ భవనానికి అనుమతులిచ్చిన జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం నిర్మాణం తలపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి ఎందుకు అనుమతులివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.