బూజు పట్టిన మిఠాయిలు: కరాచీ బేకరీపై ఫిర్యాదు, రూ. 10 వేల జరిమానా
హైదరాబాద్: నగరంలోని ఓ ప్రముఖ బేకరీపై జీహెచ్ఎంసీ అధికారులు కొరఢా ఝళిపించారు. మిఠాయిపై బూజు ఉందంటూ శనివారం ట్విట్టర్ వేదికగా అందిన ఫిర్యాదుపై పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్పందించారు. ఖాజాగూడలోని కరాచీ బేకరీపై కేసు నమోదు చేసి జరిమానా విధించారు.
కరాచీ బేకరీలో కొన్న మిఠాయిలపై బూజు ఉందంటూ ఓ నెటిజన్.. రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆయన.. వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బేకరీలో కొనుగోలు చేసిన మిఠాయి చెడిపోయిందని ఓ పౌరుడి ఫిర్యాదుతో చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు.
ఈ క్రమంలో ఖాజాగూడలోని కరాచీ బేకరీలో సోదాలు నిర్వహించిన అనంతరం.. సదరు ఫిర్యాదుపై జరిమానా విధించారు. సర్కిల్ సహాయ వైద్యాధికారి కేఎస్ రవి, ఆహార కల్తీ నియంత్రణ అధికారి సూర్య వెంటనే బేకరీకి వెళ్లి తనిఖీలు చేశారు. బేకరి పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. పరిశుభ్రత లేకపోవడం, వ్యర్థాల కలబోత, ప్లాస్టిక్ వినియోగం, మురుగు నీటి వ్యవస్థ సవ్యంగా లేకపోవడం, కొవిడ్ నిబంధనలను పాటించకపోవడాన్ని నిర్ధారించిని అధికారులు.. అక్కడికక్కడే రూ.10వేల జరిమానా విధించారు.
@GHMCOnline @Director_EVDM https://t.co/z7t4JyZ8ET
— Arvind Kumar (@arvindkumar_ias) January 1, 2022
మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించామని, ఫలితం వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. అయితే, కరాచీ బేకరీకి చెందిన ఆహార పదార్థాల్లో నాణ్యత సరిగ్గా ఉండటం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.