గదిలో బంధించి యువతిపై 20 రోజుల పాటు గ్యాంగ్ రేప్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఓ బొటిక్ డిజైనర్పై కొంత మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బొటిక్ ఏర్పాటు చేసేందుకు సాయం చేస్తామని నమ్మించి రప్పించారు.
ఆ తర్వాత ఆమెను ఓ గదిలో బంధించి 20 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. కాశ్మీర్కు చెందిన పాతికేళ్ల యువతిపై జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిరుడు డిసెంబర్లో ఈ సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో చోటు చేసుకుంది.
కాశ్మీర్కు చెందిన యువతి ఇలా..
కాశ్మీర్కు చెందిన బొటిక్ డిజైనర్ ఢిల్లీలో బొటిక్ ఏర్పాటు చేసుకుని అక్కడ స్థిరపడింది. హైదరాబాదులో కూడా బొటిక్ పెట్టేందుకు డిసెంబర్లో వచ్చింది. ఆ సమయంలో ఫరీద్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు.
నమ్మించి మోసం చేశాడు
బొటిక్ కోసం షాపులు చూపిస్తున్నట్లు నమ్మించి ఆమెను జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని ఓ గదిలో నిర్బంధించాడు. మరో ముగ్గురితో పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు పెట్టవద్దని తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడని తెలుస్తోంది.
ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
యువతి వారి నుంచి ఏదో విధంగా తప్పించుకుని ఢిల్లీకి చేరింది. విషయాన్ని తల్లితో చెప్పింది. ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. నిందితులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఢిల్లీ గ్రేటర్ కైలాస్ పోలీసులను ఆదేశించింది.
నలుగురిపై హైదరాబాదులో పోలీసు కేసులు
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. దాంతో బంజారాహిల్స్ పోలీసులు ఫరీద్, మరో ముగ్గురిపై లైంగిక దాడి, నిర్బంధం, బెదిరింపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.