సహజీవనం పేరుతో మోసం: ఎస్ఐ బెదిరింపులు
హైదరాబాద్: ఉదయ్ అనే యువకుడు తనతో నాలుగేళ్ల పాటు సహజీవనం చేసి ఇప్పుడు మరో యువతిని వివాహం చేసుకున్నాడని స్వప్న అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నగరంలోని శంషాబాద్లో చోటు చేసుకుంది.
శంషాబాదులో ఉదయ్, తాను కలిసి నాలుగేళ్ల పాటు సహజీవనం చేశామని, ఇప్పుడు ఉదయ్ మరో యువతిని పెళ్లాడాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఉదయ్పై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనను ఉదయ్ బంధువు అయిన ఎయిర్ పోర్టు పోలీసుస్టేషన్ ఇమ్మిగ్రేషన్ ఎస్ఐ దబేరా బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
నలుగురు దొంగల అరెస్ట్, బంగారం స్వాధీనం
తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని తీసుకొని తల్లిదండ్రులు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా వైద్యులు చికిత్స చేయక పోవడంతో ఆ చిన్నారి మృతి చెందింది. సూర్యాపేట మండలం దాచాయగూడెంకు చెందిన హారిక అనే రెండేళ్ల చిన్నారిని తీసుకొని తల్లిదండ్రులు శనివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి పలు ఆసుపత్రులకు వెళ్లారు.
ఎవరూ చికిత్స చేయకపోవటంతో ఆ చిన్నారి హారిక మృతిచెందింది. దీంతో చిన్నారి మృతదేహంతో రోడ్డుపై కూర్చొని మృతురాలి తల్లిదండ్రులు సరిత, రాంబాబు విలపించారు. తమ బిడ్డకు చికిత్స చేసిఉంటే బతికేదని వారు కన్నీటిపర్యాంతమవుతూ చెప్పారు.